కలియుగ దైవం తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం రాష్ట్రపతికి ఛైర్మన్ బీఆర్ నాయుడు శ్రీవారి చిత్ర పటాన్ని, తీర్థప్రసాదాలను, టీటీడీ 2026 క్యాలెండర్, డైరీలను అందజేశారు. కాగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమలలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. శ్రీవారి దర్శనానంతరం పద్మావతి అతిథి గృహానికి తిరుగు ప్రయాణమైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాంభగీచ బస్ స్టేషన్ వద్ద రోడ్డు పక్కన నిల్చున్న భక్తులను పలకరించారు. ప్రోటోకాల్ను పక్కనపెట్టి ప్రజలతో మమేకమయ్యారు. తన కాన్వాయ్ ఆపి మరి అక్కడ ఉన్న వారిని కలిశారు. అనంతరం శ్రీవారి భక్తులకు రాష్ట్రపతి చాకెట్లను పంచారు. ఆలయం వెలుపల మీతో ఫొటో దిగుతామంటూ టీటీటీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్రెడ్డి విజ్ఞప్తి చేయగా రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారు. హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి రామనారాయణరెడ్డితోపాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని రాష్ట్రపతితో కలిసి ఫొటో దిగారు. సమీపంలోనే ఉన్న ఈవో సింఘాల్, కలెక్టర్ వెంకటేశ్వర్లను రాష్ట్రపతి పిలవడంతో వారూ వచ్చి ఫొటో తీయించుకున్నారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం తిరుమల చేరుకున్నారు. శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో బస చేశారు. కాగా, అంతకు ముందు తిరుచానూరు వెళ్లి శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుమల పర్యటన ముగించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు వెళ్లారు.
శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము : ప్రోటోకాల్ను పక్కనపెట్టి ప్రజలతో మమేకమైన రాష్ట్రపతి
November 21, 2025
0
Tags