బీహార్లో మహాఘట్ బంధన్ మంగళవారం మ్యానిఫెస్టోను ప్రకటించింది. తాము గెలిస్తే ప్రతీ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మహాఘట్ బంధన్ సీఎం అభ్యర్థి, ఆర్జీడీ నేత తేజస్వీ యాదవ్ ప్రకటించారు. ఈ మేరకు మ్యానిఫెస్టో విడుదల చేసిన ఆయన తమ కూటమి గెలిచిన పక్షంలో 20 రోజుల్లోపే ప్రతీ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. అదే అంశాన్ని మ్యానిఫెస్టోలో చేర్చామన్నారు. జీవిక పథకం కింద ఉన్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇస్తామన్నారు. గ్రామీణ మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి నాయకత్వం వహించే మహిళల కోసం జీవిక అనే పథకం అమలు చేస్తున్నారు. దీనికింద పని చేసేవారిని ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తింపు ఇస్తామన్నారు. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) తాజాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలపై 27 మంది నేతలను పార్టీ నుండి ఆరేళ్లపాటు బహిష్కరించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుండి వచ్చిన అధికారిక ప్రకటన ప్రకారం ఈ జాబితాలో వివిధ నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి దిగిన లేదా అధికారిక ఆర్జేడీ అభ్యర్థులను వ్యతిరేకిస్తున్న నేతలు ఉన్నారు. నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింతగా రాజుకుంటోంది. అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)ప్రతిపక్ష మహాఘట్ బంధన్.. రెండూ కూడా పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. అదే సమయంలో ప్రజలకు హామీలను కూడా గుప్పిస్తున్నాయి. రెండు రోజుల క్రితం పట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే కేవలం 20 నెలల్లో బీహార్ను నంబర్ వన్ చేస్తామని పేర్కొన్నారు.
బీహార్లో మహాఘట్ బంధన్ మ్యానిఫెస్టో విడుదల :ప్రతీ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం
October 28, 2025
0
Tags