విజయవాడ రైల్వే స్టేషన్లో విధుల్లో ఉన్న లోకో పైలట్ను ఓ ఆగంతకుడు ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం షంటింగ్ లోకో పైలట్గా పని చేస్తున్న డి.ఎబినేజర్ (52) గురువారం తెల్లవారుజామున విధుల్లో భాగంగా నైజాంగేటు సమీపంలోని ఏటీఎల్సీ కార్యాలయం నుంచి ఎఫ్-క్యాబిన్ వద్దకు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి అతని వెనుక నుంచి వచ్చి ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. రాడ్తో పలుమార్లు కొట్టడంతో తీవ్ర గాయాలైన ఎబినేజర్ అపస్మారక స్ధితిలో రైలు ట్రాక్పై పడిపోయాడు. దూరం నుంచి దీనిని గమనించిన మరో లోకో పైలట్ వృధ్వీరాజ్ పరుగున అక్కడికి వచ్చారు. సమీపంలో ఉన్న వారితో కలిసి ఎబినేజర్ను రైల్వే హాస్పటల్కు తరలించారు. పరిస్ధితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఒక ప్రైవేటు హాస్పటల్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. విజయవాడ జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐదు బృందాలతో నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రైల్వే స్టేషన్ పరిసరాలలోని సీసీ టీవీ ఫుటేజ్ల ద్వారా దాడికి పాల్పడిన నిందితుడిని గుర్తించారు. ఆ వ్యక్తే నైజాంగేటు సెంటర్లో ఆటోలో నిద్రిస్తున్న వ్యక్తిపై కూడా దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతను గంజాయి మత్తులో ఈ దాడులకు పాల్పడుతుండవచ్చని చెబుతున్నారు.
విజయవాడ రైల్వేస్టేషన్లో విధుల్లో ఉన్న లోకో పైలట్ దారుణ హత్య !
October 11, 2024
0
Tags