ఆంధ్రప్రదేశ్లో రవాణా శాఖ అధికారులపై ఏసీబీ దాడులు : రూ. 2.5 లక్షల నగదును స్వాధీనం : మోటారు వాహన తనిఖీ అధికారి అరెస్టు
ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రవాణా శాఖ అధికారులపై ఏసీబీ జరిపిన ఆకస్మిక తనిఖీల్లో సుమారు రూ. 2.5 లక్షలకు పైగా లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ మోటారు వాహన తనిఖీ అధికారిని అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 5, 6 తేదీల మధ్య రాత్రి నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని జాతీయ రహదారి-16పై ఉన్న ముసునూరు టోల్ప్లాజా వద్ద రవాణా శాఖ అధికారులు వాహనదారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఏసీబీకి పక్కా సమాచారం అందింది. దీంతో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ తనిఖీల్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ఎంవీఐగా పనిచేస్తున్న బానావత్ గోపీ నాయక్.. ఇద్దరు హోంగార్డులు, ఒక ప్రైవేట్ డ్రైవర్ సాయంతో లంచాలు స్వీకరిస్తున్నట్లు గుర్తించారు. తనిఖీల సమయంలో రోడ్డు పక్కన పడి ఉన్న రూ. 68,800 నగదును అధికారులు గుర్తించారు. అనంతరం ఎంవీఐ గోపీ నాయక్ ప్రయాణిస్తున్న కియా సెల్టోస్ కారును సోదా చేయగా, డిక్కీలో దాచిపెట్టిన రూ. 1,80,000 నగదు బయటపడింది. ఈ మొత్తం రూ. 2,48,800కు ఎలాంటి లెక్కలు లేకపోవడంతో అక్రమ వసూళ్లకు సంబంధించినదిగా భావిస్తూ ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై తదుపరి విచారణ నిమిత్తం కేసు నమోదు చేశారు.