మనుస్మృతి ఆలోచనలు మళ్లీ జీవం పోసుకుంటున్నాయి !
మహారాష్ట్రలోని పూణే ఐఎస్ఎస్ఎంఎస్ మైదానంలో శనివారం సాయంత్రం వేలాది మంది విద్యార్థినుల మధ్య నిర్వహించిన 'ఛాత్రోం కీ గూంజ్' (విద్యార్థుల ప్రతిధ్వని) వేదికగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరాఠీ భాషలో "పూణే అంటే ప్రేమ" అని సంబోధిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించి యువతలో తీవ్ర ఉత్సాహాన్ని నింపారు. భారతదేశానికి 70 కోట్ల మంది పురుషుల కంటే 70 కోట్ల మంది మహిళల ఆలోచనలు, కలలే అత్యంత కీలకమని, వారే ఈ దేశానికి అసలైన శ్రీరామరక్ష అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత పాలకుల ఆలోచనా విధానంలో 'మనుస్మృతి' ఆలోచనలు మళ్లీ జీవం పోసుకుంటున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. మనుస్మృతిలోని పాత నిబంధనల ప్రకారం మహిళలు బాల్యంలో తండ్రికి, యుక్తవయసులో భర్తకు, వృద్ధాప్యంలో కుమారుడికి లోబడి ఉండాలని, వారు స్వతంత్రంగా ఉండటానికి వీల్లేదని పేర్కొనడం తీవ్రంగా ఖండించదగిన విషయమన్నారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో యువకులు, యువతులు ఇద్దరూ అభ్యంతరకర పదాలు వాడినప్పటికీ, కేవలం యువతులు మాట్లాడిన భాషను మాత్రమే ప్రధాని మోదీ 'కల్చరల్ షాక్' అని సంబోధించడాన్ని రాహుల్ తప్పుపట్టారు. ప్రధాని మాట్లాడిన ఆ పాత వీడియో క్లిప్ను సభలోనే డిస్ప్లే స్క్రీన్పై ప్రదర్శించి చూపించారు. అబ్బాయిలు ఎలాంటి భాష వాడినా చెల్లుతుందని, అమ్మాయిలు మాత్రం ఇంట్లో పంజరంలో బందీగా ఉండాలనే ఈ భావజాలం వెనుక మనుస్మృతి ఆలోచనా విధానం దాగి ఉందన్నారు.