మోహన్ భగవత్ న్యూయార్క్ పర్యటన :సభ భావజాలాన్ని సమర్థించను : మేయర్ జోహ్రాన్ మామ్దానీ
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల వేడుకల్లో భాగంగా ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ న్యూయార్క్లోని మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్లో ప్రసంగించనున్నారు. ఈ పర్యటనపై న్యూయార్క్ నగరంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మామ్దానీ స్పందిస్తూ తాను ఈ సభ భావజాలాన్ని సమర్థించనని, కానీ అది ఒక ప్రైవేట్ ఈవెంట్ కావడం వల్ల రద్దు చేసే అధికార పరిధి న్యూయార్క్ ప్రభుత్వానికి ఉందో లేదో స్పష్టత లేదని వ్యాఖ్యానించారు. ’హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్’, ‘ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్’ వంటి సంస్థలు సిటీ హాల్ బయట నిరసన తెలుపుతూ మ్యాడిసన్ స్క్వేర్ యాజమాన్యం ఈ ఈవెంట్ అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేశాయి.’అహెడ్ ఫోరమ్’ నిర్వాహకులు స్పందిస్తూ ఈ కార్యక్రమం వసుధైవ కుటుంబకం అనే సందేశంతో అత్యంత పవిత్రమైన ఉద్దేశంతో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల గ్లోబల్ అవుట్రీచ్ కార్యక్రమంలో భాగంగా సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ అమెరికా, కెనడా, బ్రిటన్లలో పర్యటిస్తున్నారు. న్యూయార్క్లోని ప్రఖ్యాత ‘మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్’లో ఆగస్టు 29న జరగనున్న ‘యూనివర్సల్ వన్సెస్’ భారీ సభకు 5,000 మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరవుతారని భావిస్తున్నారు. అయితే, ఈ సభపై పౌర హక్కుల సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీనిపై విలేకరుల సమావేశంలో ప్రశ్నించగా న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మామ్దానీ స్పందించారు. నగరంలో తొలి భారతీయ-అమెరికన్ మేయర్గా తన కుటుంబం తనకు లౌకికత్వ విలువలను నేర్పించిందని, ప్రజల మధ్య విభజన తెచ్చే సిద్ధాంతాలను తాను వ్యక్తిగతంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇది ఒక ప్రైవేట్ ఈవెంట్ అయినందున దీన్ని రద్దు చేయడం స్థానిక నగర ప్రభుత్వ అధికార పరిధిలోకి వస్తుందో లేదో స్పష్టత లేదని పేర్కొన్నారు.