టీజీఎస్ ఆర్టీసీలో జీపీఎస్ ట్రాకింగ్ సిస్టం సేవలు : పైలట్ ప్రాజెక్టు కింద జడ్చర్ల బస్ స్టేషన్
తెలంగాణ రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టం సేవలను ప్రయాణికులకు అందించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల బస్ స్టేషన్ పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి, జీపీఎస్ విధానం ద్వారా ప్రయాణికులకు సమాచారం అందిస్తోంది. కొద్ది రోజుల కిందట టీజీఎస్ ఆర్టీసీ అధికారులు పలు రాష్ట్రాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. అక్కడి ఆర్టీసీ ద్వారా అందిస్తున్న సేవలు గురించి తెలుసుకున్నారు. కర్ణాటకలో పర్యటించిన సందర్భంలో రాయచూర్ బస్ స్టేషన్లో జీపీఎస్ విధానం ద్వారా మెట్రో స్టేషన్ తరహాలో ప్రయాణికులకు అందిస్తున్న సేవల గురించి అక్కడి అడిగి తెలుసుకున్నారు. ఈ విధానం బస్సు ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంది. ఇదే విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలని అధికారులు భావించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మొదట పైలట్ ప్రాజెక్టు కింద ఒక బస్ స్టేషన్ లో జీపీఎస్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ విధానం జడ్చర్లలో విజయవంతం అయితే మిగతా బస్ స్టేషన్లలో అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ విధానానికి సంబంధించి ఈ నెల మొదటి వారం స్టేషన్లో ఎల్ఈడీ స్క్రీన్లను, జీపీఎస్ ట్రాకర్ ఏర్పాటు చేయనున్నారు. వాటిని ఆన్ లైన్ కు అనుసంధానం చేయనున్నారు. ఇందుకు సంబంధించి కంప్యూటర్ ను అందుబాటులో ఉంచనున్నారు. జీపీఎస్ ట్రాకర్ ద్వారా ఏ బస్సు ఎక్కడికి వస్తోంది? ఎప్పుడు వస్తోంది? ఆయా మార్గాల్లో ఏ బస్సు సర్వీసులు వస్తున్నాయి? అని ఎల్ఈడీ స్ర్కీన్ మీద చూపించనున్నారు. బస్సు స్టాండ్ కు 500 మీటర్ల దూరంలో ఉండగానే జీపీఎస్ విధానం ద్వారా అటోమెటిక్ అనౌన్స్మెంట్ కూడా వస్తోంది. ఆ బస్సు ఏ ప్లాట్ ఫాం వద్ద ఆగుతుందో కూడా సమాచారం అందుతోంది. ఈ విధానంపై ప్రయాణికులు కూడా సంతృప్తిగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వివరాలన్నిటిని రికార్డ్ చేసి సంస్థకు 20 రోజుల ట్రయల్ రన్ సక్సెస్ అయినట్లు నివేదికను పంపారు. త్వరలో రాష్ర్టంలోని పలు బస్ స్టేషన్లలో ఈ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నవారు.