అమరావతిని విజయవాడ, గుంటూరుతో కలిపి సమగ్రాభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దాలి : అధికారులకు కీలక సూచనలు చేసిన సీఎం చంద్రబాబు
అమరావతిని కేవలం 29 గ్రామాలకు మాత్రమే పరిమితమైన రాజధానిగా కాకుండా విజయవాడ, గుంటూరు నగరాలతో కలిపి సమగ్రాభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దాలని అధికారులకు కీలక సూచనలు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణ పనుల్లో ఇకపై తానే స్వయంగా పర్యవేక్షణ చేపడతానని సీఎం చంద్రబాబు వెల్లడించారు. పనుల్లో జాప్యానికి తావులేకుండా అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో పాటూ ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని అధికారులకు తేల్చి చెప్పారు. అదే విధంగా నిర్మాణాల విషయంలోనై టైమ్ లైన్ ప్రకటించారు. నిర్దేశించిన కార్యాచరణ మేరకు రాజధాని నిర్మాణం కొనసాగాలని స్పష్టం చేసారు. అమరావతిలో రహదారుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనతో పాటు పచ్చదనం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలు, విశాలమైన రహదారులు, పర్యావరణ హిత అభివృద్ధితో అమరావతిని ఆదర్శ రాజధానిగా రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్ అమరావతిలో నిర్మాణాల పైన ఆరోపణలు చేస్తూ.. విజయవాడ- గుంటూరు- మచిలీపట్నం కలిపి మావిగన్ ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చారు. ఈ ప్రతిపాదన పైన రాజకీయంగా పలు విమర్శలు వచ్చాయి. రెండో విడత భూ సమీకరణ కొనసాగుతోంది. నిర్మాణాలు పూర్తి చేసుకున్న క్వార్టర్లను ప్రభుత్వానికి వచ్చే నెల అప్పగించేందుకు సీఆర్డీఏ సిద్దమైంది. ఈ సమయంలోనే సీఎం చంద్రబాబు రాజధాని పరిధి పైన చేసిన ప్రకటన ఆసక్తి కరంగా మారుతోంది.