ప్రభుత్వ పథకం పేరుతో మహిళల మోసగించిన కేటుగాళ్లు !
తమిళనాడులోని సేలం జిల్లాలో మహిళలను నమ్మించి వారు గుండు గీయించుకునేలా వికృత చేష్టలకు పాల్పడ్డారు. జుట్టు ద్వారా ఒక సరికొత్త వ్యాధి వ్యాపిస్తోందని, ఒకవేళ గుండు చేయించుకుంటే ఆ వ్యాధిని నివారించవచ్చని నమ్మబలికి ఈ దారుణ మోసానికి తెరలేపారు. చివరికి తాము మోసపోయామని గ్రహించిన బాధితులు దిగ్భ్రాంతికి గురై పోలీసులను ఆశ్రయించారు. సేలం జిల్లా అత్తూరు సమీపంలోని పుదుక్కోత్తంపాడు గ్రామానికి చెందిన ఓ మహిళకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాను అత్తూరు తహసీల్దార్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని నమ్మబలికిన ఆ వ్యక్తి, కరోనా వైరస్ తరహాలోనే జుట్టు ద్వారా ఓ కొత్త వ్యాధి వ్యాప్తి చెందుతోందని భయపెట్టాడు. దీనికి నివారణ చర్యగా ప్రభుత్వం తరఫున ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టామని చెప్పాడు. గుండు చేయించుకున్న మహిళలకు రూ.15,000, కాలేజీ చదివే విద్యార్థినులకు రూ.45,000, అలాగే పురుషులకు రూ.6,000 చొప్పున ఆర్థిక ప్రోత్సాహకం ఇస్తున్నామని నమ్మించాడు. ఆ కేటుగాడు చెప్పిన మాటలపై అనుమానం రాకుండా ఉండేందుకు, గుండు చేయించుకున్న మహిళల నకిలీ ఫొటోలతో పాటు రూ.500 నోట్ల కట్టల చిత్రాలను అదే నంబర్ నుంచి బాధితురాలి వాట్సాప్కు పంపాడు. ఆ ఫొటోలను చూసి అది నిజమైన ప్రభుత్వ పథకమేనని ఆ మహిళ గుడ్డిగా నమ్మేసింది. ఈ విషయాన్ని వెంటనే తన ఇరుగుపొరుగు వారికి వివరించడంతో, చిత్ర (63), రామాయి (62), కావేరి (64) అనే ముగ్గురు వృద్ధ మహిళలు ఆశతో స్థానిక సెలూన్కు వెళ్ళి తమ జుట్టును తొలగించుకుని గుండు చేయించుకున్నారు. అనంతరం ప్రభుత్వం ప్రకటించిన డబ్బుల కోసం సదరు వ్యక్తికి ఫోన్ చేయగా, అతని మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చి ఉంది. దీంతో అనుమానం వచ్చిన బాధితులు నేరుగా అత్తూరు తాలూకా కార్యాలయానికి వెళ్లి ఆరా తీశారు. అసలు అలాంటి ప్రభుత్వ పథకం ఏదీ లేదని అధికారులు స్పష్టం చేయడంతో తాము తీవ్రంగా మోసపోయామని బాధితులు గ్రహించారు. ఈ ఘటనపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ ఘరానా మోసంతో ప్రమేయం ఉందన్న అనుమానంతో ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.