నోటీసులు ఇవ్వకుండా, విచారణ జరపకుండా ప్రభుత్వ లేదా పోర్ట్ స్థలాల్లో నివాసముంటున్న వారిని ఆకస్మికంగా ఖాళీ చేయించడాన్ని కలకత్తా ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. కోల్కతాలోని గార్డెన్ రీచ్ పరిధిలో ఉన్న పోర్ట్ ట్రస్ట్ క్వార్టర్ల కూల్చివేత వివాదంపై విచారణ చేపట్టిన కలకత్తా హైకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. నివాస ఆధారాలకు సంబంధించి ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు లేదా గ్యాస్ బిల్లులు అనేవి ఒక వ్యక్తి ఆ సదరు ప్రదేశంలో నివసిస్తున్నారనడానికి ప్రాథమిక ఆధారాలుగా పనిచేస్తాయని తేల్చిచెప్పింది. కేవలం ఇవి పౌరసత్వానికి పూర్తి ఆధారాలు కావనే సాకుతో, ప్రజలు అక్కడ ఉండటం లేదని కొట్టిపారేయడానికి వీల్లేదని వెల్లడించింది. పబ్లిక్ ప్రిమిసెస్ యాక్ట్-1971 ప్రకారం ఏదేని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నివసిస్తున్నారని భావిస్తే, ముందుగా వారికి చట్టబద్ధంగా నోటీసులు జారీ చేయాలి. సదరు బాధితులకు తమ ఆధారాలు చూపించుకునేందుకు, వ్యక్తిగతంగా తమ వాదనలు వినిపించేందుకు పూర్తి సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రకమైన ప్రాథమిక ప్రక్రియ ఏమీ పూర్తి చేయకుండా, రాత్రికి రాత్రే ఇళ్లను కూల్చివేస్తామని రావడం సహజ న్యాయ సూత్రాలకు పూర్తిగా విరుద్ధమని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కలకత్తా డోక్ లేబర్ బోర్డ్ క్వార్టర్లలో దాదాపు 8,000 మంది పేద ప్రజలు నివాసముంటున్నారు. అధికారులు మాత్రం ఆ ప్రాంగణాలన్నీ ఖాళీగా ఉన్నాయంటూ కూల్చివేతలకు సిద్ధపడటాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. భవనాలు శిథిలావస్థకు చేరాయని చెప్పి కూల్చేయాలనుకుంటే దానికి మున్సిపల్ చట్టాల ప్రకారం ప్రక్రియ వేరేగా ఉంటుందని సూచించింది. చట్టబద్ధమైన నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి భవనాలను కూల్చడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ, బాధితుల పిటిషన్ను అనుమతించి అధికారులు చేపట్టిన అక్రమ నిర్బంధ ఖాళీ చర్యలపై కోర్టు స్టే విధించింది.
0 Comments