హైదరాబాద్ లో కాంగ్రెస్, బీజేపీ నిరసనలు హోరెత్తుతున్నాయి. ప్రధాని ఇంటి వద్ద రాహుల్ , ప్రియాంక అరెస్ట్ కు నిరసనగా కాంగ్రెస్ నేతలు ఛలో లోక్ భవన్ కు పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్న నేతలను పోలీసులు నియంత్రిస్తున్నారు. అటు ప్రధాని ఇంటి వద్ద నిరసనకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు ఛలో గాంధీ భవన్ నిర్వహిస్తున్నారు. రెండు వైపులా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క సారిగా నిరసణలు హోరెత్తాయి. ఢిల్లీలో ప్రధాని ఇంటి వద్ద ధర్నా చేసిన రాహుల్, ప్రియాంకలను పోలీసులు అరెస్ట్ చేసారు. ఆ తరువాత వదిలిపెట్టారు. వారి అరెస్ట్ కు నిరసనగా సీఎం రేవంత్ కొడంగల్ లో నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. ఇక, హైదరాబాద్ లో కాంగ్రెస్ ఛలో లోక్ భవన్ కు పిలుపునిచ్చింది. గవర్నర్ కార్యాలయం ముట్టడికి బయల్దేరిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో పాటుగా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో ప్రధాని ఇంటి వద్ద కాంగ్రెస్ నేతల ధర్నాకు నిరసనగా బీజేపీ నేతలు ఛలో గాంధీ భవన్ కు పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో గాంధీ భవన్ ముట్టడికి బయల్దేరారు. గాంధీ భవన్ వైపు వస్తున్న బీజేపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును అరెస్ట్ చేసారు. గాంధీ భవన వద్ద కాంగ్రెస్ నేతల ఫ్లెక్సీలను బీజేపీ శ్రేణులు చించి వేసాయి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. అటు కాంగ్రెస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల్లో పాల్గొంటున్నారు. మంత్రులు జిల్లాల్లో జరిగిన నిరసన కార్యక్రమాలకు హాజరు అయ్యారు. కేంద్రం వెంటనే నీట్ పరీక్ష పత్రాల లీక్ కు బాధ్యత తీసుకోవాలని.. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతల పోటా పోటీ నిరసనలతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు పెద్ద సంఖ్యలో రెండు పార్టీల కార్యాలయాల వద్ద మొహరించారు.
0 Comments