పానీపూరి తిన్న పలువురు చిన్నారులకు అస్వస్థత
తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలో పానీపూరి తిన్న పలువురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సోమవారం సాయంత్రం పానీ పూరి తిన్న అనంతరం మంగళవారం ఉదయం నుంచి పలువురు చిన్నారులకు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన తల్లిదండ్రులు చిన్నారులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. అస్వస్థతకు గురైన చిన్నారులకు వైద్య బృందం ప్రత్యేక చికిత్స అందిస్తోంది. పిల్లల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని వెల్లడించారు.