భార్య, కుమారుడికి ఉరివేసి, తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న రిటైర్డ్ టీచర్
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలోని దువ్వూరులో ‘మా కుమారుడు అమాయకుడు. మేం లేకుండా తను బతకలేడు’ అని లేఖ రాసి, భార్య, కుమారుడికి ఉరివేసి అనంతరం రిటైర్డ్ టీచర్ సైతం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ‘మా కుమారుడు సాయిసుకృత్ అమాయకుడు. నేను, నా భార్య శారీరకంగా, మానసికంగా బలహీనం అయ్యాం. మేం లేకుండా కుమారుడు బతకలేడు. ఆ కారణంగా మేం ముగ్గురం ఆత్మహత్య చేసుకుంటున్నాం. ఇందుకు ఎవరూ బాధ్యులు కాదు. ఇప్పటివరకూ మాకు తోడ్పాటు అందించిన బంధు మిత్రులకు ధన్యవాదాలు’ అంటూ సూసైడ్ నోట్ రాసి భార్య, కుమారుడికి ఉరివేసిన తరువాత రిటైర్డ్ టీచర్ సైతం ప్రాణాలు తీసుకున్న ఘటన అందర్నీ కలచివేస్తోంది. దువ్వూరుకు చెందిన చీరాల మధుసూదన రావు (65) సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేసి ఐదేళ్ల క్రితం రిటైర్ అయ్యారు. భార్య రత్నావళి (60), కుమారుడు సాయిసుకృత్ (26)తో కలసి దువ్వూరులో నివసిస్తున్నారు. తనకు మామిడి పండ్లు కావాలని వరుసకు సోదరి అయ్యే దొరసానమ్మతో ఆదివారం నాడు మధుసూదన రావు మాట్లాడారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఆమె పండ్లు తీసుకుని వచ్చి చూడగా ఇంటి తలుపులు లోపల నుంచి వేసి ఉన్నాయి. ఎంత పిలిచినా ఎవరూ స్పందించకపోవడంతో చుట్టుపక్కల ఇళ్ల వారితో కలిసి తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లారు. హాల్లో మధుసూదన రావు, రత్నావళి దంపతులు, దేవుడి గదిలో సాయిసుకృత్ మృతదేహాలు ఉరికి వేలాడుతూ కనిపించడంతో అంతా షాకయ్యారు. దరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే ముగ్గురి కాళ్లూచేతులూ కట్టేసి ఉండటంతో అనుమానాలు నెలకొన్నాయి. మధుసూదన రావు దంపతులకు పిల్లలు పుట్టలేదు. దాంతో సాయిసుకృత్ని ఆత్మకూరు ప్రాంతం నుంచి తీసుకొచ్చి పెంచుకున్నారు. దత్తపుత్రుడు అయినా ప్రేమగా పెంచారు. బీటెక్ వరకు చదివించారు. ఈ క్రమంలో సాయిసుకృత్ తిరుపతిలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ లో చేరాడు. అయితే ఆ కంపెనీ శాలరీ ఇవ్వకపోవడంతో గత గురువారం మధుసూదన రావు తిరుపతిలోని ఆ కంపెనీకి వెళ్లి అడిగారు. కుమారుడి పనితీరు బాగాలేదని, సోమవారం వచ్చి సర్టిఫికెట్లు తీసుకెళ్లాలని కంపెనీ చెప్పింది. కుమారుడి సాఫ్ట్వేర్ జాబ్ పోవడంతో తల్లిదండ్రులు తీవ్ర వేదనకు గురయ్యారు. అసలే తాము వృద్ధాప్యంలో ఉన్నామని, తాము చనిపోయాక అమాయకుడైన కుమారుడు ఒంటరిగా బతకలేడని, అతడి భవిష్యత్ ఏమవుతుందోనని ఆందోళన చెందారు. ఆదివారం అర్ధరాత్రి తరువాత ఉరేసుకుని చనిపోయారని పోలీసులు భావిస్తున్నారు. భార్య, కుమారుడి కోరిక మేరకు ఆస్తులను ఎవరెవరికి ఎలా పంచాలో కూడా ఆ లేఖలో రాశారు. చనిపోవడానికి ముందు నెల్లూరులోని రెడ్ క్రాస్ సొసైటీకి కొంత స్థలాన్ని రాశారు. తమ అంత్యక్రియల ఖర్చుల కోసం ఎవరూ ఇబ్బంది పడకూడదని భావించి ఓ సోదరి బ్యాంకు అకౌంట్లో నగదు జమ చేసినట్లు సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ముగ్గురి కాళ్లు, చేతులు కట్టేసి ఉండటంతో ఎవరైనా హత్య చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.