అదుపు తప్పి బీభత్సం సృష్టించిన కారు : ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు దక్షిణ బైపాస్పై అదుపు తప్పిన కారు బీభత్సం సృష్టించింది. పాదచారులతో సహా ఒక మోటారు బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఒక మహిళ, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మరో మహిళ మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నెల్లూరు నుంచి ఒంగోలు వైపు వస్తున్న కారు దక్షిణ బైపాస్లోకి రాగానే జంక్షన్కు కొద్ది దూరంలో అదుపుతప్పి అటుగా వెళ్తున్న ఒక మోటారు బైక్ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగులుప్పలపాడు మండలం చౌటపాలెం గ్రామానికి చెందిన కవిలా సజనా (21) అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ నడుపుతున్న కొమ్ము ప్రేమ్కుమార్కు, బాలిక కవిలా ఉజ్వలకు గాయాలయ్యాయి. కారు డ్రైవర్ ఆపకుండా అదే వేగంతో వెళ్లి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న పాత్లావత్ బుజ్జిబాయి (50)ని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను జీజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. గుంటూరు జిల్లా శ్రీరాంపురం తాండాకు చెందిన బుజ్జిబాయి ఒంగోలు శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటూ బైపాస్లోని ఒక హోటల్లో పనిచేస్తోంది. కారు డ్రైవర్ పరారయ్యాడు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.