మూడు మడతల ఫోన్తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన హువావే సంస్థ, ఇప్పుడు నిలువుగా రెండు చోట్ల మడతపెట్టే వీలుండే సరికొత్త 'వర్టికల్ ట్రైఫోల్డ్' స్మార్ట్ఫోన్ రూపకల్పనపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. హువావే సంస్థ అమెరికాలో ఒక సరికొత్త డిజైన్ పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకుంది. ప్రముఖ టిప్స్టర్ డేవిడ్ కోవాల్స్కీతో కలిసి 'పోస్ట్ఫాస్ట్' అనే వెబ్సైట్ ఈ పేటెంట్ వివరాలను వెలుగులోకి తెచ్చింది. ఈ పేటెంట్ పత్రాల ప్రకారం.. కంపెనీ ఒక సరికొత్త నిలువుగా మడిచే త్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్ఫోన్పై పని చేస్తోంది. దీనికి 'హువావే పురా ఎక్స్ ట్రైఫోల్డ్' అనే పేరు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా మార్కెట్లో లభించే ఫ్లిప్ ఫోన్లు ఒకే ఒక హింజ్ (మడత) సహాయంతో ఒకసారి మాత్రమే మడతపడతాయి. కానీ, హువావే సిద్ధం చేస్తున్న ఈ సరికొత్త డిజైన్లో అడ్డంగా రెండు హింజ్లు ఉంటాయి. దీనివల్ల ఈ ఫోన్ను నిలువుగా రెండు సార్లు మడతపెట్టవచ్చు. పూర్తిగా మడిచినప్పుడు ఇది ఆంగ్ల అక్షరం 'S' ఆకారంలో కనిపిస్తుంది. ఇలా రెండు సార్లు మడవడం వల్ల ఫోన్ పరిమాణం చాలా చిన్నగా మారి, జేబులో సులభంగా ఇమిడిపోయేలా అత్యంత కాంపాక్ట్గా మారుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హువావే పురా ఎక్స్ ఫ్లిప్ ఫోన్ కంటే కూడా దీని వైశాల్యం తక్కువగా ఉంటుందని సమాచారం. ఈ డిజైన్లోని రెండు హింజ్లు ఫోన్ లోపలి భాగాలను మూడు వేర్వేరు విభాగాలుగా విభజిస్తాయి. అయినప్పటికీ, ఈ స్మార్ట్ఫోన్ మొత్తం ఒకే ఒక పొడవైన ఫ్లెక్సిబుల్ డిస్ప్లేను కలిగి ఉంటుందని పేటెంట్ పత్రాలు సూచిస్తున్నాయి. ఫోన్ను పూర్తిగా విప్పినప్పుడు చాలా పొడవైన స్క్రీన్ అందుబాటులోకి వస్తుంది. ఇది ముఖ్యంగా సామాజిక మాధ్యమాలను ఉపయోగించే వారికి, నిలువుగా ఉండే రీల్స్, షార్ట్స్ వంటి వీడియోలను వీక్షించే వారికి సరికొత్త అనుభూతిని అందిస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఇంతకుముందే హువావే సంస్థ పుస్తకంలా మూడు విధాలుగా మడితే 'హువావే మేట్ ఎక్స్టీ' ఫోన్ను చైనా మార్కెట్లో విడుదల చేసి సంచలనం సృష్టించింది. ఆ ఫోన్ 10.2 ఇంచుల భారీ స్క్రీన్తో ట్యాబ్లెట్ తరహా అనుభవాన్ని ఇస్తుంది. అలాగే, ఇటీవల మార్కెట్లోకి వచ్చిన 'హువావే పురా ఎక్స్ మాక్స్' కూడా 7.7 ఇంచుల ఫ్లెక్సిబుల్ స్క్రీన్తో వినియోగదారులను ఆకట్టుకుంది. ఇప్పుడు వీటికి భిన్నంగా, నిలువుగా మడిచే వినూత్న సాంకేతికతతో ఈ సరికొత్త పురా ఎక్స్ ట్రైఫోల్డ్ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్తోంది.
0 Comments