జోషిమఠ్ వద్ద 30 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ : వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
ఉత్తరాఖండ్లోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు ఈ వారాంతం పర్యాటకులతో పోటెత్తాయి. జోషిమఠ్, ముస్సోరీతో పాటు ప్రధాన పర్యాటక రహదారులన్నీ వాహనలతో కిక్కిరిసిపోయాయి.45 డిగ్రీల ఎండ నుంచి ఉపశమనం పొందడానికి వేలాది మంది ప్రజలు ఇక్కడికి చేరుకోవడంతో పర్వత మార్గాలన్నీ కిక్కిరిసిపోయాయి. జోషిమఠ్ వద్ద పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఇక్కడ వాహనాలు దాదాపు 25 నుంచి 30 కిలోమీటర్ల వరకు స్తంభించిపోయాయి. పర్యాటకులు గంటల తరబడి తమ వాహనాల్లో చిక్కుకుపోయారు. ముస్సోరీలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. నైనిటాల్లో సందర్శకుల సంఖ్య పెరగడంతో హోటళ్లు, గెస్ట్హౌస్లు దాదాపు పూర్తిగా నిండిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వేలాది వాహనాలతో హిమాలయాలు ప్రపంచంలోనే అతి పొడవైన పార్కింగ్ స్థలంగా మారిందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. విష్ణుప్రయాగ్ నుండి 15 కిలోమీటర్ల అవతలి వరకు పర్యాటకులు గంటల తరబడి తమ కార్లలో చిక్కుకుపోయారని హిమాలయన్ హిందూ అనే ఎక్స్ యూజర్ ఓ వీడియోను షేర్ చేశారు. హిమాచల్ ప్రదేశ్లోని మనాలి, రోహ్తంగ్లతో పాటు ఉత్తరాఖండ్లోని నైనితాల్, బద్రినాథ్, హేమకుండ్ సాహిబ్, ఔలి, జోషిమఠ్ వంటి ప్రదేశాల్లో ప్రస్తుతం పర్యాటకులు, యాత్రికుల రికార్డు స్థాయి రద్దీ కనిపిస్తోంది. పర్వతాలపై ఆహ్లాదకరమైన వాతావరణం, అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, మంచు కురిసిన దృశ్యాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. దీంతో ప్రజలు సుదీర్ఘ ప్రయాణాలను, గంటల తరబడి ట్రాఫిక్ జామ్లను భరిస్తూ పర్వత ప్రాంతాలకు వెళ్తున్నారు.