కర్ణాటకలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎమ్మెల్యే చంద్రు లమాని
కర్ణాటకలోని గదగజిల్లా శిరహట్టి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే చంద్రు లమాని కాంట్రాక్టర్ నుంచి ఐదు లక్షలు లంచం తీసుకొంటుండగా లోకాయుక్త అధికారులు పట్టుకున్నారు. రహదారి పక్కన గోడ నిర్మాణానికి అనుమతి ఇవ్వడానికి కాంట్రాక్టర్ నుంచి రూ.11 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. విజయ్ పూజార్ అనే కాంట్రాక్టర్ ఈ డిమాండ్పై లోకాయుక్తను ఆశ్రయించడంతో అధికారులు పన్నాగం పన్ని ఎమ్మెల్యేపై నిఘా పెట్టారు. లక్ష్మేశ్వరపురలోని ఆయనకు చెందిన ఆసుపత్రిలో రూ.5 లక్షలు స్వీకరిస్తుండగా ఎమ్మెల్యేతో పాటు అతని సహాయకులు మంజునాథ్ వాల్మీకి, గురునాయక్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్ ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉన్న రోడ్డుకు ఆనుకుని నిర్మించిన గోడకు క్లియరెన్స్ ఇవ్వాలంటే లంచం ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. నగదు డిమాండ్ చేస్తూ చేసిన ఫోన్ కాల్ ఆడియో ఆధారంగా లోకాయుక్త అధికారులు ఉచ్చుపన్నినట్లు సమాచారం. దార్వాడ లోకాయుక్త ఎస్పీ సిద్ధలింగప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో ముగ్గురిని అరెస్టు చేసి, అవినీతి నిరోధక చట్టం-1988 కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే అరెస్టు విషయాన్ని అసెంబ్లీ స్పీకర్కు కూడా తెలియజేశారు.