పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ విద్యను భ్రష్టు పట్టించింది : ఆకునూరి మురళి సోషల్ మీడియా వేదికగా పోస్టు
విద్యా కమిషన్లో స్కూల్ పిల్లలకు గానీ, కాలేజీ లేదా యూనివర్సిటీ స్థాయిలో బేసిక్ పాఠాలు చెప్పిన అనుభవం ఉన్న విద్యావేత్త ఎవరో చెప్పగలరా? అని హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రశ్నించారు. దానికి మాజీ ఐఏఎస్, విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ''పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ విద్యను భ్రష్టు పట్టించిన మీకు విద్య గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. కమిషన్ రిపోర్ట్ మీరు మొదటి పేజీ కూడా చదవనట్టుంది. అందుకే అందులో ఉన్న విషయాల మీద రాయకుండా మా టీం విద్యార్హతల మీద ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు. మా అర్హతలు ఏంటో మమ్మల్ని అడిగితే మేమే ఇచ్చేవాళ్లం. మా బృందంలో పీహెచ్డీ చేసిన వాళ్లు, ప్రొఫెసర్లు ఉన్నారు. విద్యా కమిషన్ సమర్పించిన రిపోర్ట్ను కూడా ఆకునూరి మురళి ఒక్కడే రాయలేదు. మీ విమర్శలు ఆడలేక మద్దెల వోడు అన్నట్టుంది. కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి వెయ్యి రెట్లు నయం. విద్యావ్యవస్థపై ఫోకస్ పెట్టారు. నెలకో రివ్యూ చేస్తారు. పదేళ్లలో కేసీఆర్ ఒక్కసారి కూడా విద్యావ్యవస్థ మీద రివ్యూ పెట్టలేదు. దయచేసి విద్య మీద రాజకీయాలు వద్దు. మీ టీం సరిగ్గా హోమ్ వర్క్ చేసినట్టు లేదు చూసుకోండి' అని హరీష్ రావుకు ఆకునూరి మురళి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.