ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లా తిర్టోల్ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువతి ప్రియుడితో కలిసి పారిపోయేందుకు ఇంటి నుంచి ఫిబ్రవరి 22న బయటకు వెళ్లింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు ఆమెను ఒక గుడి వద్దకు రప్పించి, ఆ తర్వాత ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం రహమా బస్ స్టాండ్ వద్ద ఆ మహిళను వదిలేసి పారిపోయాడు. అయితే బస్టాండ్ వద్ద ఒంటరిగా, నిరాశతో ఉన్న ఆ యువతిని బైక్పై వెళ్తున్న జార్ఖండ్కు చెందిన వ్యక్తి చూసి, సహాయం చేస్తానని చెప్పి ఆమెను బైక్పై పారాదీప్ తీసుకెళ్లాడు. అద్దె ఇంటి బిల్డింగ్పైన ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసి హత్య చేశాడు. మరునాడు ఆ మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. మహిళ మిస్సింగ్పై సోదరుడు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఆ మహిళపై ఒకే రోజు ప్రియుడు, మరో వ్యక్తి అత్యాచారం చేయడంతో పాటు ఆమెను హత్య చేసినట్లు దర్యాప్తులో బయటపడటంతో పోలీసులు షాక్ అయ్యారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
0 Comments