దావోస్ లో లక్ష్మీ మిట్టల్ తో సీఎం చంద్రబాబు భేటీ
దావోస్ లో అర్సెల్లార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ తో సీఎం చంద్రబాబు భేటీ అయి అనకాపల్లిలో నిర్మించనున్న భారీ స్టీల్ ప్లాంట్ పై చర్చించారు. దావోస్ లోని ఏపీ లాంజ్ లో జరిగిన ఈ భేటీలో ఆర్సెల్లార్ మిట్టల్ సంస్ధ సీఈవో ఆదిత్య మిట్టల్, మంత్రులు లోకేష్, టీజీ భరత్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లాలో నిర్మించనున్న అర్సెల్లార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ పురోగతిపై వీరు చర్చించారు. తొలి దశలోనే దాదాపు రూ. 60వేల కోట్లతో అర్సెల్లార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు వివిధ దశల్లో ఉన్న అనుమతులపై లక్ష్మీ మిట్టల్ సమక్షంలో అధికారులతో సీఎం సమీక్షించారు. అనంతరం ఫిబ్రవరి 15లోగా అనుమతులు, భూసేకరణ అంశాలు పూర్తి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఫిబ్రవరి 15 తరవాత అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్లార్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. సాధ్యమైనంత త్వరగా స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తి ప్రారంభించాలని సీఎం తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతులు, ఇతర సహకారం విషయంలో ఎక్కడా జాప్యం ఉండదని స్పష్టం చేశారు. అవసరమైతే ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి త్వరితగతిన అవసరమైన అన్ని అనుమతుల సాధించాలని మంత్రులు లోకేష్, టీజీ భరత్ లకు సీఎం సూచన చేశారు. ప్లాంట్ నిర్మాణం విషయంలో మంత్రి లోకేష్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆదిత్య మిట్టల్ తెలిపారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు గురించి లక్ష్మీ మిట్టల్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.