శ్రీశైలం డ్యామ్ మరమత్తుల అధ్యయనం కోసం టెక్నికల్ టీం ను ఏర్పాటు
నేషనల్ డామ్ సేఫ్టీ అథారిటీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ విజ్ఞప్తి మేరకు సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రత్యేక సాంకేతిక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం త్వరలో శ్రీశైలం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి ప్లంజ్ పూల్ కు జరిగిన నష్టం, మరమ్మతుల అవసరం పైన విస్తృతంగా అధ్యయనం చేస్తుంది. గతంలోనూ దీనిపైన నిపుణుల కమిటీ అధ్యయనం చేసి సిఫార్సులు చేసింది. అయితే ఆ సిఫార్సులు అమలుకు నోచుకోలేదు. గత ఆరు సంవత్సరాలుగా నిలిచిపోయిన ఈ అంశం పైన మళ్లీ ఇప్పుడు తాజాగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రత్యేక సాంకేతిక నిపుణుల బృందానికి సిడబ్ల్యుసి చీఫ్ ఇంజనీర్ డిజైన్స్ వివేక్ త్రిపాఠి నాయకత్వం వహిస్తారు. బృందంలో జలసంఘం నుండి సోమేశ్ కుమార్, సుమంత్, అరుణ్ ప్రతాప్, మధుకాంత్ గోయల్, సెంట్రల్ సాయిల్,మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ నుండి మనీష్ గుప్తా, సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నుండి ఎంకే వర్మ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శైలేంద్ర సింగ్, శ్రీశైలం డ్యాం చీఫ్ ఇంజనీర్ సభ్యులుగా ఉన్నారు. తెలంగాణ నీటిపారుదల శాఖతో పాటు కృష్ణా నది యాజమాన్య బోర్డులు కూడా తమ ప్రతినిధుల వివరాలను తెలపాలని సి డబ్ల్యూ సి కోరింది.అయితే శ్రీశైలం డాం దిగువన ఆప్రాన్ మరియు ప్లంజ్ పూల్ తీవ్రంగా దెబ్బతిందని, భద్రతాపరమైన ప్రమాదం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. గతంలో కూడా శ్రీశైలం డ్యామ్ ను ఎన్ డి ఎస్ ఏ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని బృందం పరిశీలించింది. శ్రీశైలం డామ్ ను పరిశీలించి భద్రత పైన ఆందోళన వ్యక్తం చేసింది. ప్లంజ్ పూల్ లోతు 122 మీటర్ల నుండి 160 మీటర్లకు పెరిగిందని, ఆప్రాన్ నుండి 50 నుంచి 250 మీటర్ల వరకు గుంతలు ఏర్పడ్డాయని వారు పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే స్పిల్ వేకు ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇంకా అనేక కీలక సూచనలు కూడా చేశారు. అయితే అవి ఇప్పటివరకు కాగితాలకే పరిమితం కాగా, తాజాగా మరోమారు కేంద్రం దీనిపైన అధ్యయనం కోసం టెక్నికల్ టీం ను ఏర్పాటు చేసింది. ఈ టీం శ్రీశైలం ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని సమగ్రంగా అంచనా వేస్తుంది. సాంకేతిక సమీక్ష నిర్వహిస్తుంది. మరమ్మతు పనుల కోసం స్పష్టమైన సాంకేతిక మార్గదర్శకాలను అందిస్తుంది. ప్రస్తుతం ఈ టీంను ఏర్పాటు చేసే అధ్యయనం చేయడం ఏళ్ళ కాలంగా పెండింగ్ లో ఉన్న శ్రీశైలం మరమత్తు పనులలో ఒక కీలక అడుగుగా చెప్పవచ్చు.