తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా ఎన్డీయేకు దూరంగా ఉంటూ, అన్నా డీఎంకే అధినేత ఎడప్పాడి కె. పళనిస్వామిపై తీవ్ర విమర్శలు చేస్తున్న ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్.. కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఆయన బుధవారం అధికారికంగా మళ్లీ ఎన్డీయే కూటమిలో చేరారు. చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్ర ప్రయోజనాలు, మంచి పాలన కోసం పాత విభేదాలను పక్కన పెట్టి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో భేటీ అయి తన మద్దతును తెలియజేశారు. అనంతరం ఎన్డీయే కూటమిలో చేరికపై దినకరన్ స్పందిస్తూ.. తమిళనాడు సంక్షేమం, పార్టీ ఉనికి కోసం కొన్ని సమయాల్లో రాజీపడటం బలహీనత కాదని, అది ఉమ్మడి ప్రయోజనాల కోసమేనని ఆయన స్పష్టం చేశారు. ఎడప్పాడి పళనిస్వామితో ఉన్న సమస్యలను "కూటమి భాగస్వాముల మధ్య ఉండే వివాదం"గా ఆయన అభివర్ణించడం గమనార్హం. దివంగత ముఖ్యమంత్రి జయలలిత (అమ్మ) ఆశయాలను అనుసరించే వారంతా ఒకే తాటిపైకి వచ్చి, రాష్ట్రంలో మళ్ళీ 'అమ్మ పాలన'ను పునరుద్ధరించడమే తమ అంతిమ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు.
0 Comments