బడ్జెట్ సమావేశాల్లో రాజధాని అమరావతికి చట్టబద్ధత ?


ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధతకు రంగం సిద్ధం అయింది. వచ్చే వారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో, ఈ సారి జరిగే క్యాబినెట్ భేటీలో ఆమోదం తర్వాత పార్లమెంట్లో బిల్లు పెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. పదేళ్లపాటు రెండు రాష్ట్రాలకు రాజధానిగా ఉన్న హైదరాబాద్ కాలపరిమితి 2024 జూన్ రెండు తో ముగిసింది. రాష్ట్ర విభజన సమయంలో పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఖరారు చేసారు. దీంతో 2024 జూన్ 2 నుంచి రాజధానిగా అమరావతిని ప్రకటించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీని పైన రాజధాని ఎంపిక ప్రక్రియ ,నిర్మాణాలపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారికం గా వివరాలు సమర్పించింది. తేదీ నుంచి కేంద్ర హోం శాఖ అడిగిన సమాచారం ఇవ్వటంతో పాటుగా తేదీ పైన స్పష్టత ఇచ్చింది. 2024 జూన్ 2 నుంచే రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్ధన పైన కేంద్ర హోం శాఖ సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలను అభిప్రాయాలు కోరింది. కాగా.. కేంద్ర మంత్రిత్వ శాఖలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి. ఇంకా పట్టణాభివృద్ధి, న్యాయశాఖలు తమ అభిప్రాయాలు వెల్లడించాల్సి ఉంది.ఈ బడ్జెట్ సమావేశాల్లోనే రాజధాని ప్రకటించేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. దీనికి ముందే మరోసారి ఏపీ ప్రభుత్వంతోనూ చర్చించనుంది. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టేముందు క్యాబినెట్లో చర్చించి తుది ఆమోదం ఇవ్వనున్నారు. ఈ మేరకు క్యాబినెట్ నోట్ తయారీలో హోంశాఖ నిమిగ్నమైనట్లు అధికార వర్గాల సమాచారం. తాజాగా అమరావతి రైతులు సైతం ఇదే అంశం పైన ఏపీ ప్రభుత్వం వద్ద ప్రస్తావించారు. ప్రభుత్వం మారినా.. అమరావతే రాజధానిగా కొనసాగే విధంగా చట్టబద్దత కావాలని డిమాండ్ చేసారు. ఏపీ ప్రభుత్వం కేంద్రంతో చేసిన సంప్రదింపులు.. చర్చల ఫలితంగా ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఏపీ రాజధానిగా అమరావతికి రాజ ముద్ర ఖాయంగా కనిపిస్తోంది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org