ఎటర్నల్ గ్రూప్ సీఈవో పదవికి దీపిందర్ గోయల్ రాజీనామా : కొత్త సీఈవోగా అల్బిందర్ దిండా


జొమాటో మాతృసంస్థ అయిన ఎటర్నల్ గ్రూప్ సీఈవో పదవికి దీపిందర్ గోయల్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ ద్వారా స్వయంగా వెల్లడించారు. అయితే ఆయన కంపెనీ నుంచి పూర్తిగా తప్పుకోవడం లేదు. బోర్డులో వైస్ ఛైర్మన్ హోదాలో కొనసాగుతారు. బ్లింకిట్ వ్యవస్థాపకుడు అల్బిందర్ దిండాను ఎటర్నల్ గ్రూప్ కొత్త సీఈవోగా నియమించారు. దీపిందర్ గోయల్ తన నిర్ణయం వెనుక ఉన్న బలమైన కారణాలను వివరించారు. ప్రస్తుతం తాను కొన్ని వినూత్నమైన ఆలోచనలపై పని చేయాలనుకుంటున్నానని, వాటిలో రిస్క్, ప్రయోగాలు ఎక్కువగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఓ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ పరిధిలో ఇలాంటి ప్రయోగాలు చేయడం సరైనది కాదని ఆయన భావించారు. భారత్‌లో ఓ పబ్లిక్ కంపెనీ సీఈఓపై చట్టపరమైన బాధ్యతలు, నియమ నిబంధనల ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, దానికి పూర్తి ఏకాగ్రత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే గ్రూప్ బాధ్యతలను మరొకరికి అప్పగించి, తాను వ్యూహాత్మక పాత్రకు పరిమితం కావాలని నిర్ణయించుకున్నారు. టైటిల్స్ మారినా, కంపెనీ లక్ష్యాల పట్ల తన నిబద్ధత తగ్గదని దీపిందర్ గోయల్ స్పష్టం చేశారు. తన జీవితంలోని 18 ఏళ్లను ఈ సంస్థ కోసం వెచ్చించానని, భారత్‌లో అత్యంత విలువైన కంపెనీగా ఎటర్నల్ గ్రూప్‌ను నిలబెట్టడమే తన కల అని పేర్కొన్నారు. భవిష్యత్ నాయకులను ప్రోత్సహించేందుకు దీపిందర్ గోయల్ ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన వద్ద ఉన్న షేర్ల కోటాను తిరిగి కంపెనీ పూల్‌లోకి మళ్లించారు. దీనివల్ల కంపెనీలోని టాలెంట్ ఉన్న ఇతర లీడర్లకు సంపద సృష్టించే అవకాశం లభిస్తుందని ఆయన తెలిపారు. బ్లింకిట్ సముపార్జన నుంచి దాన్ని లాభాల బాటలోకి తీసుకురావడంలో అల్బిందర్ కీలక పాత్ర పోషించారు. సప్లై చైన్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్‌లో ఆయనకున్న పట్టును దీపిందర్ గోయల్ ప్రశంసించారు. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org