జడ్చర్లలో ఉరేసుకుని పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య !
తెలంగాణలోని జడ్చర్ల మున్సిపాలిటీలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకుని వెలుగొమ్ముల పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అడ్డాకల్ మండలానికి చెందిన రాజశ్రీ (39) నారాయణపేటకు చెందిన శ్యాంసుందర్ను వివాహం చేసుకొంది. పంచాయతీ కార్యదర్శి గా మిడ్జిల్ మండలం వెలుగొమ్ముల గ్రామంలో విధులు నిర్వహిస్తున్న రాజశ్రీ తన ఇద్దరు పిల్లలతో కలిసి జడ్చర్ల మూడో వార్డులోని వెంకటేశ్వర కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. సోమవారం ఉదయం ఇద్దరు పిల్లలను పాఠశాలకు పంపించిన రాజశ్రీ ఇంట్లోనే చీరతో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పాఠశాల నుండి ఇంటికి వచ్చిన ఇద్దరు పిల్లలు తమ తల్లి తలుపు తీయకపోవడంతో ఇంటి ఓనర్ కు చెప్పారు. ఈ తరుణంలో ఆయన కిటికీలో చూడగా రాజశ్రీ అప్పటికే ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉంది. ఈ విషయాన్ని ఇంటి ఓనర్ స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై మల్లేష్ ఫ్యాన్ కు వేలాడుతున్న రాజశ్రీ మృతదేహాన్ని కిందకు దించారు. కాగా రాజశ్రీ ఎవరితోనో వీడియో కాల్ మాట్లాడినట్లు వాట్సాప్ లో చాట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే రాజశ్రీ ఆత్మహత్య చేసుకున్నాక ఎవరో ఇంటికి వచ్చి తలుపులు తట్టి కిటికీలో నుంచి చూసి వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయినట్లు సమాచారం. కాగా, రాజశ్రీ భర్త శ్యాంసుందర్ నారాయణపేట లో మెడికల్ షాప్ నడుపుతూ ఉంటాడని అప్పుడప్పుడు భార్య వద్దకు వచ్చి పోయేవాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సిసి ఫుటేజ్ తో పాటు రాజశ్రీ ఫోన్ వీడియో కాల్ చాటింగ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టనున్నారు.