ఆంధ్రప్రదేశ్ లో పీఎంఏవై 2.0 కింద పక్కా ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తుల ఆహ్వానం !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) 2.0 కింద పక్కా ఇళ్లు నిర్మాణానికి దరఖాస్తులను ఆహ్వానించింది. బెనిఫిషయరీ ల్యాండ్ కన్స్ట్రక్షన్ (బీఎల్సీ) కింద అంటే భూమి ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారి వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తులను దాఖలు చేసుకునేందుకు ఈ నెల 14 వరకే గడువు ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు ఎటువంటి గడువు నిబంధన ఇవ్వలేదని సచివాలయ ఉద్యోగులు తెలిపారు. కేవలం దరఖాస్తుల స్వీకరణకు మాత్రమే ఆదేశాలు వచ్చాయని అన్నారు. అలాగే ఎన్ని ఇళ్లు మంజూరు చేస్తారనే దానిపై కూడా ఇంకా మార్గదర్శకాలు విడుదల కాలేదని, ఎన్ని దరఖాస్తులు దాఖలు అయితే అన్నింటికి మంజూరు చేసే అవకాశం ఉందని సచివాలయ ఉద్యోగులు తెలిపారు. ఒక వేళ తరువాత మార్గదర్శకాలు విడుదల అయితే, ఆ మార్గదర్శకాలు ప్రకారం ఇళ్లు మంజూరు అవుతాయని పేర్కొన్నారు.