తెలంగాణలో జిల్లాల తగ్గింపు ఆలోచనపై బండి సంజయ్ ఆగ్రహం !
తెలంగాణలో జిల్లాల తగ్గింపు ఆలోచనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మరిన్ని కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణపై సమీక్షిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికపై ప్రశ్నించారు. జిల్లా, మండలాల పునర్విభజన చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి ఇప్పుడు జిల్లాల తగ్గింపుపై ఎందుకు ఆలోచిస్తోందని ప్రశ్నించారు. తెలంగాణలోని జిల్లాలను ఎందుకు తగ్గించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనేది ఎవరికి అర్థం కావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా పది జిల్లాల నుంచి 33 జిల్లాలుగా తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం విస్తరించింది. రాజకీయ అవసరాల మేరకే బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని జిల్లాలను ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ, అవసరమైతే వాటి సంఖ్యను తగ్గించాలని సూచించేందుకు న్యాయ కమిషన్ను నియమించాలని ప్రభుత్వం యోచిస్తోందని అంతకుముందు సీఎం మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే.