ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ పెంపు
ఆంధ్రప్రదేశ్ నూతన క్రీడా పాలసీ దేశంలో ఉత్తమ క్రీడా విధానంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు నాలుగు లక్ష్యాలతో పాలసీకి రూపకల్పన చేయాలని సూచించారు. రాష్ట్రంలో నూతన క్రీడా విధానంపై చంద్రబాబు సోమవారం సమీక్ష నిర్వహించారు. ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్స్, ఆసియా గేమ్స్ విజేతలకు ఇచ్చే ప్రోత్సాహకం భారీగా పెంచాలని నిర్ణయించారు. ఒలింపిక్స్లో బంగారు పతకం గెలిస్తే ఇచ్చే ప్రోత్సాహకం రూ.75 లక్షల నుంచి రూ.7 కోట్లకు పెంచాలని ఆదేశించారు. స్పోర్ట్స్ ఫర్ ఆల్ విధానంతో నూతన క్రీడా పాలసీకి చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఏసియన్ గేమ్స్లో పాల్గొన్న వారికి రూ.10 లక్షలు ఇవ్వాలని సూచించారు. వరల్డ్ ఛాంపియన్ షిప్, వరల్డ్ కప్ పోటీల్లో బంగారు పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు, రజతం సాధించిన వారికి రూ.35 లక్షలు, కాంస్యం సాధించిన వారికి రూ.25 లక్షలు ఇవ్వనున్నారు. నేషనల్ గేమ్స్లో బంగారు పతకం సాధించిన వారికి రూ.10 లక్షలు, రజతం సాధించిన వారికి రూ.5 లక్షలు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.3 లక్షల ప్రోత్సాహం ఇవ్వాలని ప్రతిపాదించారు.