దేశంలో జమిలి ఎన్నికలు సాధ్యం కాదు !
దేశంలో వన్ నేషన్-వన్ ఎలక్షన్ అమలు చేయటం ఎట్టిపరిస్థితుల్లో సాధ్యం కాదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చెప్పారు. దేశంలో 'వన్ నేషన్ వన్ ఎలక్షన్'ను అతి త్వరలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. జమిలి ఎన్నికలపై పార్లమెంట్ ఏకాభిప్రాయం అవసరం కాబట్టి వన్ నేషన్- వన్ ఎలక్షన్ అమలు చేయటం అసాధ్యం అని ఖర్గే తెలిపారు. ప్రధాని మోడీ ఏమి చెప్పారో.. దానిని ఆయన చేయరన్నారు. ఎందుకంటే వన్ నేషన్-వన్ ఎలక్షన్ పార్లమెంట్ ముందుకు వచ్చినప్పుడు.. అందరి ఆమోదం తీసుకోవాలని.. అప్పుడు మాత్రమే అమలులోకి వస్తుందన్నారు. గురువారం సర్దార్ వల్లభాయ్ పటేల్ 149వ జయంతి సందర్భంగా గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి మోడీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మోడీ మాట్లాడుతూ ''మేం ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా పని చేస్తున్నాం. ఇది భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. అదే విధంగా త్వరలో భారత్లో వన్ నేషన్-వన్ ఎలక్షన్తో పాటు కామన్ సివిల్ కోడ్ అమలు కానుంది.'' అని మోడీ అన్నారు.