ఇజ్రాయెల్పై దాడికి పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది !
ఇజ్రాయెల్పై దాడికి పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ను యూఎస్ రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ హెచ్చరించారు. ఇజ్రాయెల్కు తనను తాను రక్షించుకునే హక్కు ఉందని పునరుద్ఘాటించారు. ''భద్రతాపరమైన పరిస్థితులు, ఇజ్రాయెల్ ఆపరేషన్ల గురించి ఆ దేశ రక్షణమంత్రితో నేను మాట్లాడాను. తనను తాను రక్షించుకునేందుకు ఇజ్రాయెల్కు ఉన్న హక్కుకు మా మద్దతు ఉంటుందని నేను స్పష్టం చేశాను. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై జరిగిన ఆ తరహా దాడులకు తావులేకుండా ఉండేందుకు సరిహద్దు వెంబడి హెజ్బొల్లాకు చెందిన నిర్మాణాలను నిర్వీర్యం చేయాల్సిన అవసరాన్ని మేం గుర్తించాం. సరిహద్దుకు ఇరువైపులా ఉన్న ప్రజలు సురక్షితంగా తమ ఇళ్లకు తిరిగివెళ్లాలి. దానికి దౌత్యపరమైన తీర్మానం అవసరమని స్పష్టంచేశాను. ఇరాన్, దాని మద్దతున్న గ్రూప్ల నుంచి అమెరికా సిబ్బంది, మిత్రులను రక్షించుకునేందుకు యూఎస్ సంసిద్ధంగా ఉంది. ఇజ్రాయెల్పై ప్రత్యక్ష దాడికి పాల్పడితే.. ఇరాన్ తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది'' అని లాయిడ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇజ్రాయెల్ నేర చర్యలకు శిక్ష తప్పదని, తమ దేశం తగురీతిలో స్పందిస్తుందని ఇరాన్ విదేశాంగమంత్రి నుంచి తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అమెరికా నుంచి ఈ స్పందన వచ్చింది.