నారా లోకేష్ వాట్సాప్ ను బ్లాక్ చేసిన మెటా !
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఫోన్ కాల్తో చివరకు తనకు మెసేజ్ వచ్చినా స్పందిస్తూ ఆ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటున్నారు. ఓ వైపు ప్రజా దర్భార్తో ప్రజల సమస్యల నుంచి వినతులు స్వీకరిస్తూ, మరోవైపు సోషల్ మీడియాలో తన దృష్టికి వచ్చిన సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. అయితే, పెద్ద ఎత్తున వాట్సాప్ కు మెసేజ్లు వస్తుండడంతో మంత్రి లోకేష్ వాట్సాప్ ఖాతాను మెటా బ్లాక్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలకు మంత్రి కీలక సూచనలు చేశారు. ప్రజలు తమ సమస్యలు తన పర్సనల్ మెయిల్ ఐడీ hello.lokesh@ap.gov.inకి పంపాలని విజ్ఞప్తి చేశారు. తానే స్వయంగా ఆ మెయిల్ చూసి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు..సమస్య ఏదైనా, సహాయం కావాలన్నా ఇకనుంచి తనకు hello.lokesh@ap.gov.in ఈ మెయిల్ ఐడీకి పంపాలని మంత్రి నారా లోకేష్సూచించారు. సాయం కోసం వచ్చే ప్రజలకు నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్న ఆయన, నేనే అందరి సమస్యలు నేరుగా పరిష్కరించే ప్రయత్నం చేస్తాను అన్నారు. పేరు, ఊరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ, సమస్య - సహాయంకు సంబంధించిన పూర్తి వివరాలు వినతులలో పొందుపరచాలని పేర్కొన్నారు.. తనకు మెయిల్ చేస్తే తాను స్పందిస్తాను అన్నారు. వాట్సాప్ తరచూ బ్లాక్ కావడంతో ప్రజలు పంపే మెసేజ్లు చూసే అవకాశం ఉండటం లేదు. దయచేసి అందరూ మెయిల్ ఐడీకే వినతులు పంపించాలని మంత్రి నారా లోకేష్ కోరారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కాగా, సామాన్య ప్రజానీకం పడుతున్న కష్టాలు, వారి సమస్యల పరిష్కారం కోసం మంత్రి లోకేష్ నిర్వహిస్తోన్న ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభిస్తోంది. ఉండవల్లి నివాసంలో 16వ రోజు ప్రజాదర్బార్ కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు.