ఇన్స్పెక్టర్గా ట్రాన్స్ జెండర్ మన్వి మధు కశ్యప్ !
ట్రాన్స్ జెండర్ మన్వి మధు కశ్యప్ ఇటీవల సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టుకు ఎంపికైంది. ఆమె ఎంపికైంది బీహార్ రాష్ట్రంలో కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ట్రాన్స్ జెండర్లు అంటే చిన్న చూపు. ఇక చదువుకోవడం అంటే గగనమే. మధు కశ్యప్ కూడా చాలా కష్టాలను ఎదుర్కొంది. చదువుకునే సమయంలో, ట్రైనింగ్ కోసం ఇనిస్టిట్యూట్లో అడ్మిషన్ కూడా దొరకలేదు. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించడంతో సాధ్యమయ్యింది. 'తనలాంటి వారికి అడ్మిషన్ ఇచ్చేందుకు ఏ ఇనిస్టిట్యూట్ ముందుకు రాదు. తనకు సీటు ఇస్తే ఆ సంస్థకు చెడ్డ పేరు వస్తోందని భావించారు. చాలా సార్లు అడ్మిషన్ కోసం ట్రై చేసి ఉరుకున్న. చివరికీ అడ్మిషన్ పొందడంతో తన జీవితంలో మార్పు మొదలైంది. కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. కష్ట సమయంలో తల్లిదండ్రులు, సోదరి, సోదరులు మద్దతు ఇచ్చారు. ముఖ్యంగా రెహమాన్ సార్ చేసిన సాయం జీవితంలో మరవలేను. ఇనిస్టిట్యూట్లో అడ్మిషన్ వచ్చేందుకు కారణం ఆయనే. ఈ రోజు తాను ఈ స్థితిలో ఉండేందుకు కారణం రెహమాన్ సార్. ప్రతి విద్యార్థికి గురువు అతిపెద్ద వరం అని' మధు కశ్యప్ అభిప్రాయ పడ్డారు. 'సీఎం నితీష్ కుమార్, రెహమాన్ సార్, గరిమా మేడమ్ అందరికీ ధన్యవాదాలు. తాను ఇన్స్పెక్టర్ అయ్యానంటే అందుకు కారణం ప్రతి ఒక్కరి సహకారం. తాను జీవితంలో చాలా కష్టాలను అనుభవించా. ఓ ట్రాన్స్ జెండర్ ఈ స్థాయికి రావడం చాలా కష్టంతో కూడుకున్న పని. చివరికి తాను అనుకున్నది సాధించా. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని' మన్వి మధు కశ్యప్ వెల్లడించారు.