జూలై 4న దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ !
నీట్ పేపర్ లీకేజీలను నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ తదితర వామపక్ష విద్యార్థి సంఘాలు జూలై 4న దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. బంద్కు విద్యా సంస్థల యాజమాన్యాలు సహకరించాలని ఈ మేరకు విద్యార్థి సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. నీట్, నెట్ పేపర్ లీకేజీలకు నిరసనగా దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. పరీక్షల నిర్వహణలో విఫలమైన ఎన్టీఏను రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటున్నారు. ఇవే డిమాండ్లతో జూలై 4న బంద్కు పిలుపునిచ్చాయి. మరోవైపు నీట్ అక్రమాలను నిరసిస్తూ మంగళవారం విద్యార్థి సంఘాలు పార్లమెంట్ మార్చ్ చేపట్టనున్నాయి. జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరవధిక నిరసనలు ఆరు రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి.