చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే తప్పకుండా వెళతా !
టీడీపీ అధినేత చంద్రబాబు తనను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే తప్పకుండా వెళతానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏపీ ఎన్నికల్లో ప్రజలంతా కూటమి రావాలని ఫిక్స్ అయ్యారు. వారి నిర్ణయాన్ని ఓట్ల రూపంలో తెలిపి సంచలన విజయాన్ని అందించారు. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 164 , 25 లోక్ సభ స్థానాలకు గాను 21 అందించి కూటమిని గెలిపించారు. కూటమి అధికారంలోకి రావడం పట్ల తెలుగు ప్రజలతో పాటు ఇతర రాజకీయ ప్రముఖులు , సినీ , బిజినెస్ , క్రీడా ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక కూటమి విజయం పట్ల సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూటమి విజయం పై , అలాగే చంద్రబాబు ప్రమాణ స్వీకారం పై స్పందించారు. నిన్న కూటమి విజయం సాదించగానే సోషల్ మీడియా వేదికగా అభ్యర్థులకు అభినందనలు తెలిపిన రేవంత్, ఈరోజు మీడియా సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు తనను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే తప్పకుండా వెళతానని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగా రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామని గతంలోనే చెప్పానని గుర్తు చేశారు.