కేదార్ నాథ్ లో హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ !
ప్రముఖ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన, చార్ ధామ్ క్షేత్రాల్లో ఒకటైన కేదార్ నాథ్ ఆలయాన్ని, బద్రీనాథ్ ఆలయాన్ని, గంగోత్రి యమునోత్రి ఆలయాలను దర్శించే చార్ ధామ్ యాత్రలో ఒకటైన కేదార్ నాథ్ కు బయలుదేరిన ప్రయాణికులకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. వారు ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్ సాంకేతిక లోపంతో గాలిలో చెక్కర్లు కొట్టింది. పైలెట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో చార్ ధామ్ యాత్రకు వెళ్లిన భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. ఎన్నో సవాళ్లతో కూడుకున్నది చార్ ధామ్ యాత్ర. అక్కడ పూర్తిగా భిన్నమైన వాతావరణం ఉంటుంది. మంచు కొండల మధ్య వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఇక చార్ ధామ్ యాత్రకు వెళ్లే వాళ్ళు ప్రత్యేకంగా ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా మంచుతో కప్పబడిన ఎత్తైన కొండలు, లోయలలో ఈ యాత్రను చేయవలసి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది అత్యంత సాహసోపేతమైన యాత్ర. ఇక అటువంటి యాత్రను చేయడానికి ప్రతి సంవత్సరం చాలా మంది భక్తులు వెళుతూ ఉంటారు ఈ సంవత్సరం మే 12వ తేదీన చార్ ధామ్ యాత్రను ప్రారంభించగా శివయ్యను దర్శనం చేసుకోవడానికి భక్తులు వెళుతున్నారు. ఇక అక్కడ హెలికాఫ్టర్ లో కూడా ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఈ క్రమంలోని కేస్ట్రల్ ఏవియేషన్ కు చెందిన హెలికాప్టర్ సిస్రీ నుండి కేదార్ నాథ్ కు బయలుదేరింది. అందులో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలెట్ ఎమర్జెన్సీ లాండింగ్ చేస్తుండగా గాలిలో చెక్కర్లు కొడుతూ హెలికాప్టర్ హెలీపాడ్ కు సుమారు 100 మీటర్ల దూరంలో గడ్డి నేల పైన ల్యాండ్ అయింది. ఒక్కసారిగా హెలికాప్టర్ గాల్లో చక్కర్లు కొడుతూ గందరగోళం సృష్టించడంతో అక్కడ ఉన్న వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. గట్టిగా కేకలు వేస్తూ, అక్కడి నుంచి పరుగులు పెట్టారు. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదము జరగలేదు. హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో పాటు పైలెట్ కూడా సురక్షితంగా బయట పడ్డారు. ఇది ఇలా ఉంటే ఈ ఘటనపై జిల్లా విపత్తుల నిర్వహణ అధికారి స్పందించారు. సిస్రీ నుంచి కేదార్నాథ్ ధామ్ కు ఆరుగురు ప్రయాణికులతో హెలికాప్టర్ వస్తున్న క్రమంలో సాంకేతిక సమస్య చోటు చేసుకోవటంతో అత్యవసర ల్యాండింగ్ చేయవలసి వచ్చిందని, అసలు సాంకేతిక సమస్యకు గల కారణాలను విచారిస్తామని పేర్కొన్నారు.