ప్రజ్వల్ పాస్పోర్టును రద్దు చేయమని కేంద్రానికి లేఖ రాసిన కర్ణాటక ప్రభుత్వం !
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ, జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ పాస్పోర్టు రద్దు చేయాలని కర్ణాటక ప్రభుత్వం శాశ్వత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు శుక్రవారం లేఖ రాసింది. ప్రజ్వల్ ఏప్రిల్ 27న జర్మనీకి వెళ్లిపోయాడు. అతడ్ని తిరిగి భారత్ రప్పించాలని కర్ణాటక ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ప్రజ్వల్ను అన్ని కోణాల్లో విచారించి నేరం రుజువైతే కఠిన శిక్షలు పడేలా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే ప్రజ్వల్ని భారత్కి తిరిగి రమ్మని మాజీ ప్రధాని దేవెగౌడ కోరారు. లేదంటే తన ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. స్వదేశానికి తిరిగి వచ్చి దర్యాప్తు సంస్థలకు సహకరించాలని సూచించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం గతంలోనే ప్రధాని మోడీకి లేఖ రాశారు. "ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తిరిగి తీసుకురావాలి. ఇందుకోసం కేంద్రం చొరవ తీసుకోవాలి. ఆయన పాస్పోర్టును శాశ్వతంగా రద్దు చేయాలి. రేవణ్ణపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కొన్ని గంటల ముందు పాస్పోర్ట్ ఉపయోగించి జర్మనీకి పారిపోవడం సిగ్గుచేటు. నిందితుడికి లుక్ అవుట్, బ్లూ కార్నర్, సెక్షన్ 41A CrPC కింద నోటీసులు పంపినా స్పందించకపోవడం ఆందోళన కలిగిస్తోంది" అని మోడీకి రాసిన లేఖలో సిద్దరామయ్య పేర్కొన్నారు.