సహరాన్పూర్ మసీదు కూల్చివేత వివాదం : నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించిన అసదుద్దీన్ ఒవైసీ
రాజస్తాన్ లోని జైపూర్లో ఇవాళ ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మసీదుల కూల్చివేతలు, రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛపై బీజేపీకి కక్ష ఉందని ఆయన విమర్శించారు. సహరాన్పూర్ మసీదును నిర్మించిన సమయంలో స్థానిక ముస్లిం కుటుంబమే మసీదుతో పాటు ఆలయానికి కూడా భూమిని దానం చేసిందని తెలిపారు. ఆ మసీదు రిజిస్టర్డ్ వక్ఫ్ ఆస్తిగా ఉండి, చట్టపరమైన రక్షణను కలిగి ఉందన్నారు. తాజాగా ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వక్ఫ్ చట్ట సవరణ రాజ్యాంగ విరుద్ధమైనదని తీవ్ర అభ్యంతరకరమైనదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ప్రభుత్వ భూమిపై ఏదైనా నిర్మాణం జరిగి, అది అక్కడ 30 ఏళ్లుగా నివాసం ఉంటే, ఆ స్థలంలో నివసించే వారికి చట్టప్రకారం ప్రతికూల స్వాధీన హక్కులు లభిస్తాయనేది కేంద్రానికి తెలిదా అంటూ నిలదీశారు. భారత రాజ్యాంగం పౌరులకు గ్యారెంటీ ఇచ్చిన మత స్వేచ్ఛపై బీజేపీకి కేవలం ద్వేషం మాత్రమే ఉందన్నారు. అందుకే దేశవ్యాప్తంగా జైపూర్, సహరాన్పూర్ వంటి ప్రాంతాల్లో విచ్చలవిడిగా మసీదుల కూల్చివేతలకు పాల్పడుతున్నారంటూ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.