లంక క్రికెటర్ ప్రబాత్ జయసూర్యకు ఐసీసీ హెచ్చరిక జారీ
భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠగా సాగుతోంది. ప్రతి మ్యాచులోనూ మైదానంలో ఆటగాళ్ల ప్రవర్తన వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటికే యశస్వి జైస్వాల్, అసిథ ఫెర్నాండోలకు జరిమానా విధించిన ఐసీసీ, తాజాగా శ్రీలంక స్టార్ స్పిన్నర్ ప్రబాత్ జయసూర్యపై కూడా చర్యలు తీసుకుంది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు వచ్చిన ప్రబాత్ జయసూర్య కేవలం రెండు పరుగులకే నిరాశగా పెవీలియన్ బాటపట్టాడు. భారత స్పిన్నర్ మానవ్ సుతార్ బౌలింగ్లో రోజు ఆట ముగిసే చివరి బంతికి ఔట్ కావడాన్ని అతను తట్టుకోలేకపోయాడు. పెవిలియన్కు తిరిగి వెళ్తున్న సమయంలో తీవ్ర కోపంతో తన వద్ద ఉన్న బ్యాట్తో బౌండరీ లైన్ వెడ్జెస్ను గట్టిగా బాదాడు. స్టేడియంలో ఉన్న వస్తువులను ధ్వంసం చేసే విధంగా ప్రవర్తించడం ఐసీసీ నిబంధనల ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. జయసూర్య ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన ఐసీసీ అతనికి హెచ్చరిక జారీ చేసింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ లోని ఆర్టికల్ 2.2 ప్రకారం మైదానంలోని వస్తువులను లేదా సామగ్రిని కొట్టడం క్రమశిక్షణా రాహిత్యం కిందకు వస్తుంది. ఈ క్రమంలోనే అతనికి ఒక డీమెరిట్ పాయింట్ను కేటాయించింది. గత 24 నెలల కాలంలో జయసూర్య చేసిన మొదటి తప్పు కావడంతో ఐసీసీ కేవలం మందలింపు, డీమెరిట్ పాయింట్తో సరిపెట్టింది.