మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు దిశగా కసరత్తు ?
ఆంధ్రప్రదేశ్ మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి రాజకీయ పార్టీ భవిష్యత్ గురించి త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సాయిరెడ్డి వైసీపీలోకి వెళ్తున్నారనే ప్రచారమూ జరిగింది. ఈ సమయంలో సాయిరెడ్డి కీలక మంత్రాంగం కొనసాగిస్తున్నారు. కొత్త పార్టీ ప్రకటనకు సిద్దమయ్యారు. వైఎస్ కు విధేయుడిగా, జగన్ కు అత్యంత సన్నిహితుడుగా, వైసీపీ హయాంలో నెంబర్ టూ గా వ్యవహరించిన విజయ సాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ప్రకటించనున్నారు. వైసీపీ ఓటమి తరువాత పార్టీలో వేగంగా చోటు చేసుకున్న పరిణామాలతో సాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు గా ప్రకటన చేసారు. వ్యవసాయం చేసుకుంటానని వెల్లడించారు. లిక్కర్ కేసులో సిట్ అధికారుల విచారణకు హాజరయ్యారు. జగన్ కోటరీలో చోటు చేసుకున్న పరిణామాల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ నేతలతో మాత్రం సాయిరెడ్డి ఇప్పటికీ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారనే వాదన ఉంది. ఒక దశలో సాయిరెడ్డి బీజేపీలోకి వెళ్తారనే ప్రచారమూ జరిగింది. ఇక.. తన ఇంట్లో ఈడీ సోదాల తరువాత సీఎం చంద్రబాబు లక్ష్యంగా సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీలో సాయిరెడ్డి తిరిగి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం వేళ తన రాజకీయ భవిష్యత్ పైన త్వరలో ప్రకటన చేస్తానని వెల్లడించారు. కాగా, ఇప్పుడు సాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటన దాదాపు ఖరారైంది. పార్టీ పేరు 'భారత్ జన వికాస్' గా ఖరారైనట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయ వేదికగా ఈ పార్టీని శ్రావణ మాసంలో లాంచ్ చేయడానికి ఆయన సిద్దం అయినట్లు తెలుస్తోంది. ఆగస్టు 15న ఈ పార్టీ ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. విజయ సాయిరెడ్డి ఈ పార్టీ ద్వారా ప్రధానంగా మహిళలు, రైతులు, యువత, అభివృద్ధి అజెండాగా ప్రకటన చేస్తారని తెలుస్తోంది.