టైఫూన్ దెబ్బకు చైనా అతలాకుతలం
చైనాలో ప్రకృతి విలయం కొనసాగుతోంది. శక్తివంతమైన టైఫూన్ బవి తూర్పు తీరాన్ని తాకడంతో భారీ వర్షాలు, పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా దాదాపు 20 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో వరదలు, చెట్లు విరిగిపడటం, రవాణా అంతరాయాలు చోటుచేసుకున్నాయి. టైఫూన్ బవి చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ తీర ప్రాంతాన్ని తాకింది. తీరాన్ని తాకే సమయంలో గంటకు సుమారు 144 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు వాతావరణ అధికారులు తెలిపారు. అనంతరం తుపాను బలహీనపడి తీవ్ర ఉష్ణమండల తుపానుగా మారినప్పటికీ, భారీ వర్షాల ముప్పు కొనసాగుతోంది. తుపాను ప్రభావంతో జెజియాంగ్ ప్రావిన్స్లో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా యూకింగ్ ప్రాంతంలో వందల సంఖ్యలో చెట్లు నేలకూలగా, కొన్ని ప్రాంతాల్లో రోడ్లు నీటమునిగాయి. అత్యవసర సిబ్బంది భారీ యంత్రాలతో రంగంలోకి దిగి రోడ్లను శుభ్రం చేసే పనులు చేపట్టారు.