'పరీక్షల మేనిఫెస్టో'ను ప్రకటించిన కాక్రోచ్ జనతా పార్టీ
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని సావిత్రిబాయి ఫూలే పుణె విశ్వవిద్యాలయం ప్రాంగణంలో వందలాది మంది విద్యార్థులు, సీజేపీ శ్రేణులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నిరసనల సందర్భంగా సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే విద్యార్థుల హక్కుల రక్షణ కోసం ఒక చారిత్రాత్మక ‘పరీక్షల మేనిఫెస్టో’ను విడుదల చేశారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను ఎండగడుతూ, విద్యార్థులకు భరోసా కల్పించేలా అందులో పలు కీలక డిమాండ్లను పొందుపరిచారు. ఏదైనా ప్రభుత్వ పరీక్ష పేపర్ లీక్ అయినా, పరీక్షలు వాయిదా పడినా లేదా ఫలితాల ప్రకటనలో జాప్యం జరిగినా బాధిత విద్యార్థులందరికీ రూ. 10,000 చొప్పున పరిహారం చెల్లించాలి, లక్షలాది మంది అభ్యర్థులు హాజరయ్యే భారీ నియామక పరీక్షల సమయంలో విద్యార్థుల ప్రయాణ సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడపాలి, ఏదైనా కారణం చేత పరీక్ష రద్దయితే, తదుపరి 72 గంటల్లోగా ప్రత్యామ్నాయ తేదీని కేటాయించి పరీక్షను పూర్తి చేయాలి, ఆన్లైన్ అసెస్మెంట్కు స్వస్తి చెప్పి, జవాబు పత్రాలను భౌతికంగా మూల్యాంకనం చేయాలి, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పరీక్షలు లేదా ఫలితాలు ఆలస్యమైతే, ప్రభావితమైన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఇవ్వాలి, పరీక్షలకు ముందే కంప్యూటర్ ఆధారిత పరీక్షా వ్యవస్థలపై తప్పనిసరిగా ఆడిట్లు నిర్వహించాలి. పరీక్షల నిర్వహణ కాంట్రాక్టులను కేవలం మెరిట్ ఆధారంగానే కేటాయించాలి.