రాజధాని ప్రాంతంలో అల్లర్లు సృష్టించేందుకు కుట్రలను అమరావతి రైతులు తిప్పికొట్టారు !
మూడు రాజధానుల పేరుతో గతంలో అమరావతిపై విషం చిమ్మిన జగన్ అండ్ కో, ప్రస్తుతం అక్కడ జరుగుతున్న శరవేగ అభివృద్ధి పనులను చూసి తట్టుకోలేకపోతున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీకి సంబంధించిన వారు నిన్న రాజధాని ప్రాంతంలో అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు పన్నారని, అయితే అమరావతి రైతులు ఆ కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టారని ఆయన పేర్కొన్నారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి రైతులపై అక్రమ కేసులు బనాయించి, తీవ్రంగా వేధించి హింసించారని మంత్రి మండిపడ్డారు. నాడు రైతులను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలు, నేడు ఏ మొహం పెట్టుకుని రాజధాని ప్రాంతంలో పర్యటిస్తారని ఆయన ప్రశ్నించారు. "అమరావతి అనేది దేవతల రాజధాని. జగన్ ఎన్ని కుట్రలు పన్నినా దీనిని ఏమీ చేయలేరు" అని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అన్నారు. కూటమి ప్రభుత్వం అమరావతికి పూర్తి చట్టబద్ధత కల్పించిందని, ప్రస్తుతం అక్కడ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పినా జగన్ వైఖరిలో మార్పు రాలేదని, ఇంకా 'మావిగన్' అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ అండ్ కో పన్నుతున్న ప్రతి కుట్రను ప్రజలు గమనిస్తున్నారని, వారి ఆటలు సాగవని మంత్రి వీరాంజనేయస్వామి హెచ్చరించారు.