కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు : పలువురు ప్రయాణికులకు గాయాలు
కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసింది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, వరుస క్షిపణుల దాడిలో కువైట్ ఎయిర్ పోర్ట్ టెర్మినల్ 1 భారీగా దెబ్బతింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు అందుతున్నాయి. దాడి అనంతరం విమాన సర్వీసులన్నింటినీ నిలిపివేశారు. కువైట్ కు రావాల్సిన కొన్ని విమానాలను ఇతర గమ్యస్థానాలకు మళ్లించారు. దాడి వల్ల మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని కువైట్ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకటించింది. దీనిపై కువైట్ న్యూస్ ఏజెన్సీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ దాడిని కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ సవూద్ అబ్దుల్అజీజ్ అల్ ఒటాయిబి నిర్ధారించారు. ఎయిర్ పోర్ట్ టెర్మినల్ 1ను ఇరాన్ లక్ష్యంగా చేసుకుందని అన్నారు. ఈ ఘటన చోటు చేసుకున్న వెంటనే అత్యవసర సహాయక బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాయి. గాయపడిన వారి వివరాలు, వారి ఆరోగ్య పరిస్థితిపై గానీ, లేదా విమానాశ్రయ కార్యకలాపాల పునరుద్ధరణపై గానీ అధికారులు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. గతంలో కూడా కువైట్ ఎయిర్ పోర్ట్ ధ్వంసానికి గురైన విషయం తెలిసిందే. మరమ్మతులు పూర్తి చేసుకుని, దశలవారీ పునఃప్రారంభమైంది.