లక్కీ డ్రా పేరిట 'ఫామ్ ల్యాండ్' మోసాలు : కలకలం రేపుతున్న నయా దందా
హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంతకాలంగా మందగించడంతో, ప్లాట్లు అమ్ముడుపోక రియల్టర్లు కొత్త ఎత్తుగడలకు తెరలేపుతున్నారు. పాత పద్ధతుల్లో కస్టమర్లను ఆకర్షించడం కష్టం కావడంతో, సామాన్యుల ఆశలను పెట్టుబడిగా మార్చుకునే సరికొత్త మోసపూరిత స్కీమ్లను రంగంలోకి దించారు. కేవలం రూ. 2,500 కడితే చాలు.. లక్కీ డ్రా ద్వారా ఎకరా ఫాం ల్యాండ్ లేదా ఓపెన్ ప్లాట్ మీ సొంతం చేసుకోవచ్చంటూ రంగారెడ్డి జిల్లా పరిధిలో సాగుతున్న ఒక నయా దందా ఇప్పుడు కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లాలోని మాడ్గుల, బ్రాహ్మణపల్లి , వాటి పరిసర ప్రాంతాల్లోని లే-అవుట్లలో ఈ తరహా లక్కీ డ్రా దందా జోరుగా సాగుతోంది. స్థానిక ఏజెంట్లు, చిన్న తరహా రియల్ ఎస్టేట్ సంస్థలు గుంపులుగా ఏర్పడి సోషల్ మీడియా వేదికగా, కరపత్రాల ద్వారా దీనికి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. రూ. 2,500తో టోకెన్ తీసుకోండి.. అదృష్టం ఉంటే లక్షల విలువైన ఫాం ల్యాండ్ మీ సొంతం.. డ్రాలో పేరు రాకపోయినా మీ డబ్బులు వెనక్కి ఇస్తాం లేదా ప్లాట్ కొనుగోలుపై డిస్కౌంట్ ఇస్తాం అంటూ నమ్మబలుకుతున్నారు. ఈ ఆఫర్లను నమ్మి వేలాది మంది అమాయక ప్రజలు, మధ్యతరగతి జీవులు ఈ టోకెన్లు కొనుగోలు చేస్తూ రియల్టర్ల అకౌంట్లలో కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్నారు. నిజానికి, ఈ తరహా లక్కీ డ్రాలు నిర్వహించడానికి, ప్రజల నుంచి డిపాజిట్లు లేదా టోకెన్ల రూపంలో నగదు వసూలు చేయడానికి హెచ్ఎండీఏ , డీటీసీపీ లేదా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ నుంచి ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులు లేవు. సదరు వెంచర్లకు కనీస లే-అవుట్ అప్రూవల్స్ కూడా ఉండటం లేదని తెలుస్తోంది. కేవలం వ్యవసాయ భూములను చూపించి, డ్రా పేరుతో వందలాది మంది నుంచి కోట్లు వసూలు చేశాక.. రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసేందుకు ఈ ముఠాలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చివరికి డ్రాలో ఎవరికి ప్లాట్ వచ్చింది, ఎవరి డబ్బులు ఎటు పోయాయో తెలియని ఒక పెద్ద కన్ఫ్యూజన్ను క్రియేట్ చేయడమే ఈ స్కీమ్ అసలు వ్యూహం. ఈ అక్రమ లక్కీ డ్రా వ్యవహారంపై రంగారెడ్డి జిల్లా రెవెన్యూ, పోలీస్ అధికారులు తీవ్రంగా స్పందించారు. అనుమతులు లేని ఇలాంటి చిట్ ఫండ్ తరహా రియల్ ఎస్టేట్ స్కీమ్ల పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, కేవలం రూ. 2,500 కదా అని మోసపోవద్దని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి వసూళ్లకు పాల్పడుతున్న సదరు నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి కసరత్తు చేస్తున్నారు.