అంబటి రాంబాబు నిరాహార దీక్ష : ఇల్లు, కార్యాలయంపై జరిగిన దాడిలో నిందితుల్ని అరెస్ట్ చేయాలన్న డిమాండ్
తన ఇల్లు, కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా నిందితుల్ని అరెస్ట్ చేయాలన్న డిమాండ్ తో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నిరాహార దీక్ష చేపట్టారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ నిరాహార దీక్ష చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఇంటిపై దాడి జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు సీఐలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబును దూషించిన సాకును చూపి అరెస్ట్ చేసి 18 రోజులు జైల్లో ఉంచారని, తన ఇంటిపై దాడిచేసిందే కాక కారు, ఫర్నీచర్ ధ్వంసం చేసినవారిని కనీసం 18 నిమిషాలైనా జైల్లో వేశారా ? అని ప్రశ్నించారు. పోలీసుల కళ్లెదుటే ఇదంతా జరిగినా చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. తన ఇల్లు, ఆఫీసుపై జరిగిన దాడి వెనుక మంత్రి నారా లోకేశ్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ల హస్తం ఉందని ఆరోపించారు. గుంటూరులో ఇళ్లపై దాడులు చేసే సంస్కృతిని తీసుకొచ్చారని విమర్శించారు. గతంలో తనను అరెస్ట్ చేసిన సమయంలో నల్లపాడు పోలీస్ స్టేషన్లో కస్టోడియల్ టార్చర్ కు గురిచేసే ప్రయత్నం జరిగిందని, ఆనాటి శరీర గాయాలు నేటికీ పూర్తిగా మానలేదన్నారు. తనను భయపెట్టడం ఎవ్వరితరం కాదని, తన జోలికొచ్చిన ఎవ్వరినీ వదిలిపెట్టనని అంబటి రాంబాబు హెచ్చరించారు.