క్యాబ్ బుక్ చేసినంత ఈజీగా కేరళలో కొబ్బరి కాయలను తీసే వ్యక్తిని పిలిపించుకోవచ్చు : ఆనంద్ మహీంద్ర ట్వీట్
ఆధునిక కాలంలో పెరుగుతున్న టెక్నాలజీ, భారతీయులు దాన్ని వినియోగించుకుంటున్న తీరుపై మహీంద్ర అండ్ మహీంద్ర అధినేత ఆనంద్ మహీంద్ర ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అత్యంత సాంప్రదాయకమైన, స్థానిక సేవలను కూడా డిజిటలైజ్ చేస్తున్నామంటూ ఆనందాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన ఆయన షేర్ చేసిన వీడియో నెట్టింట సందడిగా మారింది. క్యాబ్ని బుక్ చేసుకున్నంత సులభంగా ఇపుడు కేరళలో కొబ్బరి కాయలను తీసే వ్యక్తిని పిలిపించుకోవచ్చు. ఒక శిక్షణ పొందిన వృత్తినిపుణుడు, యూనిఫాం ధరించి, అవసరమైన పరికరాలతో సైకిల్పై వచ్చి తన పనిని పూర్తి చేసుకొని వెళ్లిపోతాడు. ఈ ఉదంతంలో తనను బాగా ఆకట్టుకున్న మరో విషయం ఏమిటంటే ఆ చెట్లు ఎక్కిన యువకుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవాడు అంటూ రాసుకొచ్చారు. అలాగే తన కరీర్ ప్రారంభం నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. తన కెరీర్ ప్రారంభంలో గ్రూప్ స్టీల్ బిజినెస్లో పనిచేస్తున్నప్పుడు, ఫర్నేస్ , ఫౌండ్రీ షాపుల్లో పనిచేసే వాళ్లకోసం ఎదురు చూడాల్సి వచ్చేది. వీరిలో చాలా మంది తమ ఇళ్లకు దూరంగా వచ్చినవారే. ముఖ్యంగా వీరంతా బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుండి ఉపాధి వెతుక్కుంటూ వచ్చేవారు.