స్వదేశంలోనే వివక్షను ఎదుర్కొన్నాను !


టీమిండియా మాజీ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ స్వయంగా భారత క్రికెట్ నియంత్రణ మండలిపై సంచలన ఆరోపణలు చేస్తూ కామెంటరీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. గత రెండు దశాబ్దాలుగా తన గొంతుకతో అభిమానులను అలరించిన ఆయన, తన పట్ల వర్ణ వివక్ష చూపారని ఆరోపించారు. సుమారు 23 ఏళ్లుగా బ్రాడ్‌కాస్టింగ్‌ రంగంలో ఉన్నప్పటికీ బీసీసీఐ తనను కావాలనే విస్మరించిందని శివరామకృష్ణన్ వాపోయారు. ముఖ్యంగా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో టాస్ వేయడం, అవార్డు ప్రజెంటేషన్ వంటి కీలక బాధ్యతలను తన కంటే జూనియర్లకు అప్పగించారని, తన రంగును బట్టి తనను పక్కన పెట్టారని ఆయన సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. 'ప్రపంచవ్యాప్తంగా నాకు గౌరవం దక్కింది కానీ, నా స్వదేశంలోనే వివక్షను ఎదుర్కొన్నాను' అని ఆయన పేర్కొన్నారు. మాజీ కోచ్ రవిశాస్త్రి హయాంలో కూడా పిచ్ రిపోర్ట్ వంటి బాధ్యతలకు కొత్తవారికే ప్రాధాన్యత ఇచ్చారని, సీనియర్‌గా ఉన్న తనను కనీసం పరిగణనలోకి తీసుకోలేదని ఆయన విమర్శించారు. ఎవరికో దాసోహం అయ్యి తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేనని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ వద్దని వారించినప్పటికీ, శివరామకృష్ణన్ మాత్రం తన నిర్ణయానికే మొగ్గు చూపారన్నారు. ఈ పరిణామం భారత క్రికెట్ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org