ముందస్తు జాగ్రత్తగా బుర్జ్ ఖలీఫా భవనాన్ని ఖాళీ చేయించిన అధికారులు
దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాను భవనాన్ని ముందస్తు జాగ్రత్తగా అధికారులు ఖాళీ చేయించారు. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడులు చేయడంతో దుబాయ్ నగరం అంతటా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారని నివేదికలు పేర్కొంటున్నాయి. ఖతార్, కువైట్, యూఏఈ , బహ్రెయిన్లోని అమెరికా బేస్లపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ క్షిపణులను ప్రయోగించినట్లు ప్రకటించింది. అబుదాబిపై జరిగిన ఈ దాడుల్లో ఒక ఆసియా జాతీయుడు మరణించినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. మరోవైపు, ఇరాన్లోని కీలక సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ” పేరుతో భారీ ప్రతిదాడిని ప్రారంభించింది. ఈ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలు తమ గగనతలాన్ని నిరవధికంగా మూసివేయడంతో అంతర్జాతీయ విమానయాన రంగం స్తంభించిపోయింది. ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి భారతీయ విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేయగా, అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం అక్కడ ఉన్న భారతీయుల కోసం ప్రత్యేక అడ్వైజరీని జారీ చేసింది. పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నందున అనవసర ప్రయాణాలు మానుకోవాలని, స్థానిక అధికారులు , రాయబార కార్యాలయం ఇచ్చే సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని భారతీయ పౌరులకు సూచించడమైనది. ఈ యుద్ధ పరిణామాలు పశ్చిమాసియాలో పెను రాజకీయ, భద్రతా సంక్షోభానికి దారితీస్తున్నాయి.