ఉత్తర ప్రదేశ్, గ్రేటర్ నోయిడాకు చెందిన హర్ష్ అనే వ్యక్తి స్థానిక ధుమ్ మానిక్పూర్ ఏరియాలోని ఒక పెట్రోల్ బంకులో శుక్రవారం తన బ్లాక్ మహీంద్రా థార్లో డీజిల్ పోయించుకుని డీజిల్కు బిల్లు చెల్లించకుండా వేగంగా వెళ్లిపోయాడు. వెంటనే కుల్దీప్ శర్మ అనే పెట్రోల్ బంక్ సిబ్బంది ఒకరు బైకుపై అతడిని వెంబడించాడు. జీటీ రోడ్డులోని నేషనల్ హైవే 91పై థార్ను అనుసరిస్తూ వెళ్లాడు. ఈ క్రమంలో ఆ బైకు అదే మహీంద్రా థార్ కింద పడిపోయింది. అయినప్పటికీ హర్ష్ థార్ను ఆపకుండా అలాగే వేగంగా పోనిచ్చాడు. చుట్టుపక్కల వాళ్లు చూసి ఆపేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. వాహనం కింద బైకు, రైడర్ ఉన్నాడని డ్రైవర్కు చెప్పినా అలాగే థార్ నడిపాడు. దీంతో కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు కూడా చాలా దూరం థార్ వెంటపడ్డారు. చివరకు ఒక టోల్ ప్లాజా వద్ద థార్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే థార్ కింద బైక్ దాదాపు పది కిలోమీటర్లు అలాగే ఉంది. రోడ్డుపై వాహనం రాజుకుంటూ వెళ్లడంతో కొంత మంటలు కూడా చెలరేగాయి. ఈ ఘటనలో బైక్ రైడర్ కుల్దీప్ శర్మ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని పోలీసులు స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనలో బైకుతోపాటు థార్ కూడా ధ్వంసమైంది. పోలీసులు హర్ష్ ను అదుపులోకి తీసుకొని, థార్ను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
0 Comments