గాజాలో జరుగుతున్న అమానవీయ ఘటనలపై ఇజ్రాయెల్ పార్లమెంట్ లో మాట్లాడండి!
ఇజ్రాయెల్ లో ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల అధికారిక పర్యటన నేపథ్యంలో ఆ దేశ పార్లమెంట్లో గాజాలో జరుగుతున్న అమానవీయ ఘటనలపై మాట్లాడాలని వాయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా ప్రధానికి ఈ సూచన చేశారు. గాజాలో వేలాది మంది బలైపోతున్న తీరును 'మారణకాండ'గా అభివర్ణించిన ఆమె ఈ అంశాన్ని ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించి, బాధితులకు న్యాయసాయం అందించాలని కోరారు. స్వతంత్ర భారత చరిత్రలో అనాదిగా మనం అనుసరిస్తున్న సత్యం, శాంతి, న్యాయం వైపు నిలబడే సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటిచెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని ఆమె ఈ సందర్భంగా ప్రధానికి గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా బుధవారం అక్కడికి చేరుకున్నారు. 2017లో ఇజ్రాయెల్లో పర్యటించిన తొలి భారత ప్రధానిగా రికార్డు సృష్టించిన మోదీ, తొమ్మిదేళ్ల అనంతరం మళ్లీ ఆ దేశ గడ్డపై అడుగుపెట్టారు. ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు ఆహ్వానం మేరకు సాగుతున్న ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై సమీక్ష జరగనుంది. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, రక్షణ, భద్రత, వ్యవసాయం, నీటి యాజమాన్యం, వాణిజ్య రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృతం చేయడంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. ప్రధాని మోడీ తన పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్తో భేటీ కావడంతో పాటు, నెతన్యాహుతో కలిసి ప్రత్యేక విందులో పాల్గొంటారు. కాగా గాజా అంశంపై ప్రియాంకా గాంధీ మొదటి నుంచీ స్పష్టమైన వైఖరితో ఉన్నారు. గతంలో పార్లమెంటు సమావేశాలకు హాజరైన సమయంలోనూ ఆమె పాలస్తీనాకు మద్దతుగా తన గళం వినిపించారు. గత ఏడాది అక్టోబర్లో ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన 'సమగ్ర శాంతి ప్రణాళిక' ఒప్పందం తర్వాత యుద్ధం తగ్గుముఖం పట్టినప్పటికీ, గాజాలో మానవతా సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది.